హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీజీ, పీహెచ్డీ కోర్సులకు ఆఫ్లైన్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి పీహెచ్డీ, పీజీ కోర్సుల ఆఫ్లైన్ కౌన్సిలింగ్ బుధవారం నాడు మొదలైంది. రాజేంద్రనగర్లోని వర్సిటీ ఆడిటోరియంలో ఈ నెల 7వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.
మొదటిరోజైన బుధవారం నాడు పీహెచ్డీ కోర్సులకు కౌన్సిలింగ్ జరిగింది. విశ్వవిద్యాలయం ఇంఛార్జి రిజిస్ట్రార్ డాక్టర్ పి. జగన్మోహన్రావు కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ కౌన్సిలింగ్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. విద్యాసంస్థలపై కొవిడ్ మహమ్మారి తీవ్రమైన ప్రభావం చూపిందని అన్నారు.
అయినప్పటికీ విద్యార్థుల చదువులు దెబ్బతినకుండా సాధ్యమైనంత వరకు అకాడమీ క్యాలెండర్ని అమలు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. విద్యార్థులందరూ ఖచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. అదే విధంగా కళాశాలల అడ్మిషన్ సమయంలో ఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరిగా ఉండాలన్నారు.
అన్నీ అనుకున్నట్లు జరిగితే జనవరి 17వ తేదీన కోర్సులు ప్రారంభిచనున్నట్లు వర్సిటీ అధికారులు తెలియజేశారు. జనవరి 6, 7 తేదీల్లో పీజీ కోర్సులకి కౌన్సిలింగ్ జరగనున్నట్లు పేర్కొన్నారు.