హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : ఎంసెట్లో ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఈ ఏడాది కూడా ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. ఇంటర్లో కనీస మార్కులు సాధించాలన్న నిబంధనను యథాతథంగా కొనసాగిస్తున్నట్టు వెల్లడించింది. దీంతో ఇంటర్లో జనరల్ విద్యార్థులు 45 శాతం, రిజర్వ్డ్ క్యాటగిరీ విద్యార్థులు 40 శాతం మార్కులు సాధిస్తేనే ఎంసెట్కు హాజరుకావొచ్చని సూచించింది. కరోనా ప్రభావం కారణంగా మూడేండ్లుగా ఎంసెట్లో ఇంటర్ వెయిటేజీ నుంచి మినహాయింపు ఇచ్చారు. తాజాగా ఈ విద్యాసంవత్సరం ఇంటర్ వెయిటేజీ అంశంపై ఉన్నత విద్యామండలి అధికారులు నిపుణుల కమిటీ వేశారు. ఈ కమిటీ… జేఈఈ సహా ఇతర రాష్ర్టాలను అనుసరిస్తూ ఈ ఏడాది కూడా వెయిటేజీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంతో శుక్రవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఎంసెట్ షెడ్యూల్ విడుదల
టీఎస్ ఎంసెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, నర్సింగ్) షెడ్యూల్ను శుక్రవారం హైదరాబాద్ జేఎన్టీయూలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్చాన్స్లర్ కట్టా నరసింహారెడ్డి విడుదల చేశారు. మార్చి 3వ తేదీ నుంచి ఏప్రిల్ 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తామని వెల్లడించారు. 28న ఎంసెట్ నోటిఫికేషన్ను విడుదల చేస్తామని తెలిపారు. ఈ సంవత్సరం బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో సీట్లను కూడా ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తామని స్పష్టంచేశారు. దరఖాస్తు, ఫీజు ఇతర వివరాలకు www. eamcet. tsche.ac.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.
7 నుంచి 11 వరకే పరీక్షలు..
తాజా అంచనాల ప్రకారం ఎంసెట్ పరీక్షలు మే 7వ తేదీన ప్రారంభమై, 11న ముగియనున్నాయి. తొలుత మే 7వ తేదీ నుంచి 14 వరకు పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇటీవలే ప్రకటించారు. అయితే గతంలో ఒక సెషన్కు 27 వేల మంది విద్యార్థులు మాత్ర మే పరీక్షలు రాసే అవకాశముండగా, తాజాగా ఈ సామర్థ్యాన్ని రోజు కు 40వేలకు పెంచారు. దీంతో పరీక్షలు మే 11తోనే ముగిసే అవకాశాలున్నాయి. అయితే, దరఖాస్తుల సంఖ్య పెరిగితే పరీక్ష సెషన్లను కూడా పెంచుతామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్కుమార్ తెలిపారు. ఎంసెట్ పరీక్షలను ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యా హ్నం 3గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తామని వివరించారు.
ఏటా ఎంసెట్కు డిమాండ్
రాష్ట్రంలో ఎంసెట్ రాసే వారి సంఖ్య ఏటా పెరుగుతున్నది. తెలంగాణ విద్యార్థులే కాకుండా ఏపీ ఇతర రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు సైతం ఎంసెట్కు హాజరవుతున్నారు. దీంతో డిమాండ్ తీవ్రమవుతున్నది. మన దగ్గర ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు గణనీయంగా లభించడం, క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఉత్తమ ప్యాకేజీలు లభిస్తుండటంతో విద్యార్థులు ఇటువైపే క్యూ కడుతున్నారు. ఇందుకు మూడేండ్లుగా ఎంసెట్కు వస్తున్న దరఖాస్తులే తార్కాణం.