హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : ఎనిమిదో తరగతి చదువుతున్న చాలామంది విద్యార్థులు రెండో తరగతి పాఠాలను చదవలేకపోతున్నారు. గణిత సమస్యలను పరిష్కరించలేకపోతున్నారు. కానీ పదో తరగతిలో ఏటా 90 శాతానికిపైగా ఉత్తీర్ణత. రెండో తరగతి పాఠాలను చదవలేనివారు పదో తరగతిలో ఎలా పాసవుతున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎక్కడో ఏదో లోపం జరుగుతున్నదన్న అనుమానాలు విద్యాశాఖ పెద్దలను పట్టిపీడిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాల విద్యాశాఖ సరికొత్త అడుగులేస్తున్నది. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఎక్స్టర్నల్ అసెస్మెంట్ను నిర్వహించాలని యోచిస్తున్నది. ప్రభుత్వ అధికారుల ఆకస్మిక తనిఖీల తరహాలో ఆకస్మికంగా పరీక్షలను నిర్వహించనున్నది. ఇందుకు సర్కారు అనుమతి కోరనున్నది. అంతా సవ్యంగా కుదిరితే వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఎక్స్టర్నల్ అసెస్మెంట్ను చేపట్టే అవకాశమున్నది.
ప్రస్తుతం రాష్ట్రంలోని పాఠశాల విద్యలో నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని అమలు చేస్తున్నారు. ఇంతకాలం టీచర్లే విద్యార్థుల ప్రతిభను పరీక్షిస్తున్నారు. ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ పేరుతో పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఎంతచేసినా విద్యాప్రమాణాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయన్న విమర్శలున్నాయి. నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో తరచూ అనేక విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. తాము చదువుతున్న తరగతి పాఠాలే కాకుండా ఐదారేండ్ల క్రితం చదివినవి సైతం రాయలేకపోతున్నారు, చదవలేకపోతున్నారు. విద్యార్థులను ఇలాగే వదిలేస్తే విద్యాప్రమాణాలు మరింత దిగజారుతాయని, ఇబ్బందులు తప్పవన్న భావనలో విద్యాశాఖ వర్గాలు ఉన్నాయి.
ఎక్స్టర్నల్ అసెస్మెంట్లో భాగంగా విద్యార్థులకు ఏటా రెండు పరీక్షలు నిర్వహిస్తారు. సంబంధిత స్కూల్ టీచర్లను ఈ పరీక్షల నిర్వహణలో భాగస్వామ్యం చేయరు. ర్యాండమ్గా ఇతర బడుల్లోని కొందరు టీచర్లను పంపించి ఆకస్మికంగా పరీక్ష పెడతారు. అన్ని సబ్జెక్టులకు పరీక్షలుంటాయి. ఎప్పుడు ఏ పరీక్ష నిర్వహిస్తారో గోప్యంగా ఉంచుతారు. జవాబుపత్రాలను మరో టీచర్తో మూల్యాంకనం చేయిస్తారు. సబ్జెక్టులవారీగా ఫలితాలను ఆన్లైన్లో పొందుపరుస్తారు. లోపాలు సరిదిద్దుకొనేందుకు అవకాశం కల్పిస్తారు. దీనిద్వారా కొంతలోకొంతైనా విద్యాప్రమాణాలు మెరుగవుతాయని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. విద్యార్థులు, టీచర్లు ఇద్దరూ గాడినపడే అవకాశముంటుందని అంచనా వేస్తున్నారు.