హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ విద్యార్థులు పరిశోధనలు చేసేందుకు వీలుగా జేఎన్టీయూహెచ్లో సెంట్రల్ రీసెర్చ్ ఫెసిలిటీ(సీఆర్ఎఫ్)ని ప్రారంభించబోతున్నట్టు యూనివర్సిటీ వైస్చాన్స్లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి, రిజిస్ర్టార్ ప్రొఫెసర్ మంజూర్హుస్సేన్ తెలిపారు.
కూకట్పల్లి క్యాంపస్లోని ఓ ప్రత్యేక భవనంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నెలలోనే దీన్ని అందుబాటులోకి తెస్తామని అన్నారు. సీఆర్ఎఫ్లో దాదాపు రూ.50 లక్షల విలువ చేసే పరికరాలు సమకూర్చుతున్నట్టు వివరించారు.
3డీ ప్రింటింగ్ మిషన్లు, రోబోటిక్ ల్యాబ్లు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్లు, ఎలక్ర్టికల్ మైక్రోమిషన్ వంటి అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. సీఆర్ఎఫ్ అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పారు.
క్యాంపస్ విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తామని, అఫిలియేటెడ్ కాలేజీల విద్యార్థులకు స్వల్ప రుసుం వసూలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఏటా దాదాపు 200 పరిశోధనలు చేసేలా కేంద్రాన్ని తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు.