JNTU | హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : బీటెక్ విద్యార్థులు కూడా రిసెర్చ్ వైపు వెళ్లేలా జేఎన్టీయూ నిర్ణయం తీసుకొన్నది. ఇక నుంచి బీటెక్ నుంచే పీహెచ్డీలోకి ప్రవేశాలు పొందేలా అవకాశం కల్పించింది. ఆనర్స్ బీటెక్ డిగ్రీ పూర్తి చేసిన వారికి ఈ అవకాశం కల్పించాలని వర్సిటీ నిర్ణయించింది. గతంలో బీటెక్ విద్యార్థులు పీహెచ్డీ చేయాలంటే.. ఎంటెక్ తప్పనిసరి. ఇప్పుడు వర్సిటీ నిర్ణయంతో అనేక మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ వెసులుబాటు కల్పించి, పీహెచ్డీ ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించింది. విద్యార్థులు 160 క్రెడిట్స్తో బీటెక్, మరో 18 క్రెడిట్స్ను పూర్తిచేస్తే ఆనర్స్ డిగ్రీని జారీ చేస్తారు. ఈ ఆనర్స్ డిగ్రీ పొందిన వారు ఎంటెక్, ఎంఫిల్ వంటి వాటితో సంబంధం లేకుండానే నేరుగా పీహెచ్డీలో ప్రవేశాలు కల్పిస్తారు.
పీహెచ్డీ అడ్మిషన్ల కోసం వర్సిటీపై పడుతున్న ఒత్తిడిని తగ్గించడంలో భాగంగా వర్సిటీ అధికారులు మరో నిర్ణయం తీసుకున్నారు. అటానమస్, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లోనూ పీహెచ్డీ చేసే అవకాశాన్నిస్తున్నారు. సంబంధిత కాలేజీలో రిసెర్చ్ సెంటర్ ఏర్పాటై ఉండాలి. ఆయా కాలేజీలోనే ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసి, రాత పరీక్ష నిర్వహిస్తారు. సెలెక్షన్ కమిటీలో జేఎన్టీయూ విషయ నిపుణులు, ప్రొఫెసర్లుంటారు. విద్యార్థి ప్రొఫెసర్ పర్యవేక్షణలో పరిశోధన చేయాలి. వైవా, థీసిస్ను సమర్పిస్తే అంతా సవ్యంగా ఉంటే పీహెచ్డీ పట్టా జారీ చేస్తారు. ఒక్కో ప్రొఫెసర్ 8 మంది విద్యార్థులకు మాత్రమే గైడ్గా ఉండాలని జేఎన్టీయూ నిర్ణయించింది.
బీటెక్ పూర్తికాగానే అత్యధికులు సాఫ్ట్వేర్ ఉద్యోగాలవైపు వెళ్తున్నారు. రిసెర్చ్ వైపు వచ్చే వారి సంఖ్య అంతంత మాత్రంగానే ఉంటున్నది. ఈ నేపథ్యంలోనే పీహెచ్డీ చేసే వారి సంఖ్యను పెంచాలని.. వారిని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నాం.
– ప్రొఫెసర్ నర్సింహారెడ్డి, వీసీ, జేఎన్టీయూహెచ్