హైదరాబాద్: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ, ఎన్ఐటీల్లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించే జేఈఈ మెయిన్ (JEE main) మొదటి విడుత పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. గురువారం నుంచి ఈ నెల 29 వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్షలను నిర్వహిస్తున్నది. రాష్ట్రం నుంచి 50 వేలకుపైగా మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు ఆన్లైన్ విధానంలో జరుగనున్నాయి. రెండో విడుత జేఈఈ మెయిన్ పరీక్షలు జులై 21 నుంచి 30 వరకు జరగనున్నాయి.
కాగా, జేఈఈ మెయిన్కు హాజరయ్యే విద్యార్థులను సొంత మాస్క్తో పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేది లేదని అధికారులు ప్రకటించారు. పరీక్ష కేంద్రాల్లో ఉచితంగా మాస్క్ను అందిస్తామన్నారు. గతేడాది మాస్క్ను ధరించి ఒకరికి బదులుగా ఒకరు పరీక్ష రాస్తూ పట్టుబడిన నేపథ్యంలో ఎన్టీఏ ఈ జాగ్రత్త తీసుకున్నది.
విద్యార్థులు తమ వెంట 2 పాస్పోర్ట్ సైజు ఫొటోలను తీసుకురావాలని, వాటిని ఏదేని ఐడీ ఫ్రూఫ్తో సరిపోల్చి చూస్తామని అధికారులు తెలిపారు. గుర్తింపు కార్డులుగా ఒరిజినల్ పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, పాస్పోర్ట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 12వ తరగతి అడ్మిట్కార్డుల్లో ఒక దాన్ని తీసుకురావాలన్నారు.