న్యూఢిల్లీ: ఇంజినీరింగ్ విద్యార్థులకు లెక్కలు రావట్లేదట. ఇంజినీరింగ్ సబ్జెక్టుల కన్నా కూడా గణితం సబ్జెక్టు నేర్చుకోవడంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. దేశంలో ఇంజినీరింగ్ విద్య నాణ్యతపై అఖిల భారత సాంకేతిక విద్య మండలి (ఏఐసీటీఈ) ఓ సర్వే చేపట్టింది. నేర్చుకోవడంలో ఇబ్బందులు విద్యార్థుల భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలకు ఎలా గండికొడుతున్నాయో ఈ సర్వే ద్వారా అంచనా వేసే ప్రయత్నం చేసింది.
దేశంలోని ఏఐసీటీఈ గుర్తింపు పొందిన 2,003 ఇంజినీరింగ్ కాలేజీలకు చెందిన 1.29 లక్షల మంది విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరందరికీ ప్రాథమిక సబ్జెక్టుల్లో ‘పరాఖ్’ పేరిట ఆన్లైన్ పరీక్ష నిర్వహించారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం సబ్జెక్టుల్లో పరీక్ష పెట్టగా, రెండు, మూడు, నాలుగో సంవత్సరం విద్యార్థులకు వారి బ్రాంచికి చెందిన సబ్జెక్టులో టెస్టు పెట్టారు. ఆప్టిట్యూడ్ పరీక్ష కూడా నిర్వహించారు. మూడు, నాలుగో సంవత్సరం విద్యార్థులకు మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంశాల్లో కూడా పరిజ్ఞానాన్ని పరిశీలించారు.
22,725 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు గణితం సబ్జెక్టులో మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని సర్వేలో తేలింది. గణితంలో సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు సరాసరి 37.48 శాతం స్కోర్ సాధించి అట్టడుగున ఉన్నారు. గణితంలో రెండో సంవత్సరం విద్యార్థులు మెరుగ్గా ఉన్నారని తేలింది. అదే మూడు, నాలుగో సంవత్సరాల విద్యార్థులు మాత్రం కాస్త వెనుకంజ వేశారని గుర్తించారు. కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చే సమయంలో కీలకంగా చూసే ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ విషయంలో చాలా తక్కువ దృష్టిపెడుతున్నారని సర్వేలో వెల్లడైంది.