మెదక్ మున్సిపాలిటీ, మే 16: కరోనా కట్టడిలో భాగం గా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ జిల్లా కేంద్రంలో ఐదో రోజూ సంపూర్ణంగా కొనసాగింది. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే నిత్యవసరాలను కొనుగోలు చేశారు. అనంతరం లాక్డౌన్ ప్రారంభం కావడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రధాన రోడ్లని నిర్మానుష్యంగా మారాయి. పోలీసులు ప్రధాన రోడ్లపై తనిఖీలు చేపట్టారు. నిబంధనల ప్రకారం అనుమతులు ఉండి పాస్లు ఉన్నవారిని మాత్రమే అనుమతించారు. ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్లపైకి వచ్చిన వారికి జరిమానా విధించారు.
లాక్డౌన్ను విధిగా పాటించాలి..మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్
లాక్డౌన్ను విధిగా పాటించాలని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ పట్టణ ప్రజలకు సూచించారు. సడలింపు సమయంలోనే పనులు పూర్తి చేసుకోని ఇండ్లకే పరిమితం కావాలని, అత్యవసర సమయంలో మాస్క్ ధరించి బయటకు రావాలన్నారు.
విజయవంతంగా కొనసాగుతున్న లాక్డౌన్..
మెదక్ జిల్లా కేంద్రంతోపాటు నియోజకవర్గంలో లాక్డౌన్ ఐదోరోజు ఆదివారం విజయవంతమైంది. వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చే వారు పది గంటలలోపు పనులు ముగించుకొని ఇంటికి వెళ్లిపోతున్నారు. మెదక్ నియోజకవర్గంలోని మెదక్, హవేళిఘనపూర్, పాపన్నపేట, చిన్నశంకరంపేట, టేక్మాల్, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, రేగోడ్ మండలాల్లో లాక్డౌన్ విజయవంతంగా కొనసాగుతున్నది. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి ప్రజలు ఎవరూ రాకపోవడంతో రోడ్లు బోసిపోతున్నాయి. పోలీసులు జారీ చేసిన ఈ-పాసులు ఉంటేనే బయటకు రావాలని పోలీసులు సూచిస్తున్నారు.