చిత్తోర్ఘర్ : రాజస్థాన్లోని చిత్తోర్ఘర్ జిల్లాలో ఘోర దుర్ఘటన జరిగింది. భవనం పైకప్పు కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా.. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. చిత్తోర్ఘర్ జిల్లా కేంద్రం పరిధిలోని ప్రతాప్ నగర్ ఖేదా ప్రాంతంలో శుక్రవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో గ్యాస్ లీకేజీ కారణంగా పేలుడు సంభవించి భవనం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలిందని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామని ఎస్పీ అమిత్ కుమార్ తెలిపారు.
ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పోలీసులతోపాటు రెండు అగ్నిమాపక శకటాలతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. తీవ్రంగా గాయపడిన వారిని హుటాహుటిన జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు.