ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్
ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుష్ (ఐఎంఐ) 4.0ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వర్చువల్గా ఫిబ్రవరి 7న ప్రారంభించారు. 33 రాష్ర్టాల్లోని 416 జిల్లాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. గర్భిణులు, పిల్లల్లో ఇమ్యునైజేషన్ను రెట్టింపు చేసే ఉద్దేశంతో ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని 2014, డిసెంబర్లో ప్రారంభించారు.
మహారాష్ట్ర-యూఎన్ఈపీ
‘మాఝీ వసుంధర’ ప్రచారానికి మద్దతుగా మహారాష్ట్ర ప్రభుత్వంతో యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్ఈపీ) కుదుర్చుకున్న అవగాహన ఒప్పందంపై ఫిబ్రవరి 9న సంతకాలు చేశాయి. వాతావరణం, భూమి పరిరక్షణ కోసం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం మాఝీ వసుంధర అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
వన్ నేషన్ వన్ రేషన్ కార్డు
ఆగస్టు 2019లో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ప్లాన్ ప్రారంభమైనప్పటి నుంచి జనవరి 31, 2022 వరకు అత్యధిక లావాదేవీలు నిర్వహించిన రాష్ర్టాల్లో బీహార్ 15.90 కోట్లతో మొదటి స్థానంలో నిలిచిందని కేంద్ర వినియోగ వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే ఫిబ్రవరి 9న తెలిపారు. ఆంధ్రప్రదేశ్ (8.51 కోట్లు) 2, రాజస్థాన్ (6.67 కోట్లు) 3, తెలంగాణ (5.16 కోట్లు) 4వ స్థానాల్లో నిలిచాయి.