తిరుమల,జూలై 6:ప్రస్తుతం మనం మర్చి పోతున్న ఆర్ష సంపదలైన రామాయణం, మహా భారతం, భాగవతం, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలను యువతకు అందించేందుకు టిటిడి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి ఉద్ఘాటించారు. తిరుమలలోని వసంత మండపంలో మంగళవారం రామాయణంలోని యుద్ధకాండ రావణ సంహారం సర్గల పారాయణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్బంగా అదనపు ఈవో మాట్లాడుతూ ధర్మాన్ని ఆచరించే వారిని ధర్మమే కాపాడుతుందనే విషయం రామాయణం మనకు తెలుపుతున్నదన్నారు. అటువంటి ధర్మాన్ని శ్రీరాముడు ఆచరించటం వలన బలవంతుడైన రావణుడు నాశనమైనట్లు చెప్పారు. కావున చెడుపై మంచి ఏప్పుడూ విజయం సాధిస్తుందని రామాయణం ద్వారా తెలుస్తున్నదన్నారు.
ఏవిధంగానైతే దుష్ట రావణుడి సంహారం ఈ రోజు అత్యద్భుతంగా పండితుల చేత యుద్ధకాండ పారాయణం ద్వారా జరిగిందో, అదేవిదంగా ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మరి కూడా త్వరలో అంతమై పోతుందనే ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. ధర్మాన్ని ఆచరించండి కరోనాను తరిమి కొటండి అనే సిద్ధాంతంతో ప్రతి ఒక్కరు ధర్మ బద్దమైన జీవనాన్ని జీవిస్తూ శ్రీవారి అనుగ్రహనికి పాత్రులు కావాలన్నారు.ఇదేవిధంగా నాదనీరాజనం వేదిపై శ్రీ భగవద్గీత పారాయణంలో చివరి రోజు శ్రీమహా విష్ణువు విశ్వరూప దర్శనం ఆవిష్కరించి భక్తులకు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అధికారులు, వేద పండితులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.