హుజురాబాద్ : నష్టాల్లో ఉన్న సంస్థలను అమ్మాలని కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు ఇస్తోంది. కానీ నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని కాపాడిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని ఆర్థికశాఖమంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంటర్ లో జరిగిన రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం లో ఆయన మాట్లాడారు. కరోనా మూలంగా రూ. 1కోట్ల నష్టం వాటిల్లినప్పటికీ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ఇచ్చిన ఘనత కేసీఆర్ది అన్నారు. అదే కేంద్రం కేవలం 7 శాతం పీఆర్సీ ఇచ్చి చేతులు దులుపుకుందని ఎద్దేవా చేశారు.
ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ఈ రెండున్నర ఏండ్లలో కనీసం రూ.10 లక్షలు వెచ్చించి ఎక్కడైనా అభివృద్ధి చేశాడా? అని హరీశ్రావు ప్రశ్నించారు. ఓటమి భయంతోనే ఈటల రాజేందర్ ఏదేదో మాట్లాడుతున్నాడన్నారు.నియోజకవర్గానికి 4వేల డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తే ఒక్కటి కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. కనీసం ఒక్క కుటుంబాన్ని కూడా గృహప్రవేశం చేయించని విషయం నిజం కాదా? వాస్తవాలు మాట్లాడితే తప్పా? అని హరీశ్రావు ప్రశ్నించారు. టీఆర్ ఎస్కు ఒక వ్యక్తి ప్రయోజనం కంటే, హుజురాబాద్ ప్రజల ప్రయోజనం ముఖ్యమని తేల్చి చెప్పారు. హుజురాబాద్ కు ఏం చేశారని బీజేపీకి ఓటు వేయాలి అని ఆయన అన్నారు.
గెల్లు శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమకారుడని, 20 ఏండ్లుగా పార్టీలో ఉన్నాడని, క్రమశిక్షణ గల వ్యక్తి అని చెప్పారు. 2 గుంటల భూమి ఉన్న గెల్లు కావాలా.? 200ఎకరాల భూమి ఉన్న ఆసామి కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నవారికి ఓటు వేస్తారా? సంస్థలను కాపాడే సీఎం కేసీఆర్ కు ఓటు వేస్తారా? అని హరీశ్రావు ప్రశ్నించారు.