జమ్మికుంట రూరల్ జనవరి 6: కరెంట్ ఓ యువకుడి ప్రాణాలను బలిగొన్నది.. ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మరణించాడు. జమ్మికుంట మండలం విలాసాగర్లో గురువారం ఈ విషాద ఘటన జరిగింది. చేతికందిన కొడుకు నిర్జీవిగా పడిఉండడాన్ని చూసి తల్లిదండ్రులు బోరుమన్నారు. మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..గ్రామానికి చెందిన చిలుక కుమారస్వామి- కోమలకు కొడుకు ప్రశాంత్ (25), కూతుర్లు రజిత అనూష ఉన్నారు.
కూలీనాలీ చేసుకుని పెద్ద రజిత కూతురు వివాహం చేశారు. కొడుకు ప్రశాంత్ డిగ్రీ ఫస్టియర్ దాకా చదువుకొని కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా మధ్యలోనే మానేశాడు. కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేందుకు 8 నెలల కిందట గుంపుల క్రాస్ రోడ్ వద్ద బిర్యాని సెంటర్ను ప్రారంభించాడు. గురువారం బిర్యాని సెంటర్ నిర్వహిస్తున్న ఈ క్రమంలో పకనే ఉన్న బజ్జీల బండిలో షార్ట్ సర్యూట్ అయింది.
బిర్యాని సెంటర్ బజ్జీల బండికి ఆనుకొని ఉండడంతో కౌంటర్కు విద్యుత్ ప్రవహించి ప్రశాంత్ కరెంట్ షాక్కు గురయ్యాడు. హోటల్లో బిర్యాని తింటున్న ట్రాక్టర్ డ్రైవర్ రాయిశెట్టి తిరుపతి ఈ విషయాన్ని గమనించి పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడారు. అప్పటికే ప్రశాంత్ మృతి చెందాడు. కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు పరుగు పరుగున ఘటనాస్థలికి చేరుకున్నారు. విగతజీవిగా కనిపించిన కొడుకును చూసి హృదయవిదారకంగా రోదించారు. సమాచారమందుకు న్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకొని, విచారణ జరిపి, మృతదేహాన్ని శవపరీక్ష కోసం జమ్మికుంట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.