పాల్వంచ రూరల్, మార్చి 28: ఎనిమిదెకరాల్లో సాగు చేసిన పంటలు చేతికి రాక.. అందుకోసం చేసిన అప్పు తీర్చే మార్గం లేక ఓ యువ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగుచూసింది. పాల్వంచ రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాల్వంచ మండలం యానంబైలు గ్రామానికి చెందిన ఎం శశికుమార్ (26) తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు. శశికుమార్ ఈ సీజన్లో ఎనిమిది ఎకరాల్లో పత్తి, వరి సాగు చేశాడు. పంటల నుంచి ఆశించినంత దిగుబడి రాకపోవడం, తీసుకున్న అప్పులకు వడ్డీలు పెరగడంతో మంగళవారం సాయంత్రం ఇంట్లో పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ శశికుమార్ గురువారం మరణించాడు. మృతుడి తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.