మహబూబ్నగర్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆయనో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్.. ఆ పార్టీ తరఫున నాగర్కర్నూల్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోదరుడు.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎస్సీలకు రిజర్వ్ చేసిన స్థానం నుంచి బరిలో ఉన్న మల్లు రవి ఎన్నికల ప్రచారం కొరకు నాగర్కర్నూల్కు వెళ్లారు. ఆ సెగ్మెంట్లోని ఓ ఫామ్ హౌస్లో టిఫిన్ కోసం ఆగారు.
అయితే తనతో అల్పాహారం చేస్తున్న దళిత యువకుడిని.. ఏయ్ పక్కకెళ్లి తిను, నా ముందు కూర్చోవద్దని చెయ్యి చూపిస్తూ అవమానించిన ఘటన సోషల్ మీడియాలో వైరలవుతున్నది. మల్లు రవి హుకుంతో పక్కనున్న నేతలు కూడా అతడిని పక్కకెళ్లు అని సైగ చేశారు. దీంతో షాక్కు గురైన దళిత కార్యకర్త ఆయన ముందు నిలబడి టిఫిన్ చేసి వెళ్లిపోయాడు. ఇది ప్రజాపాలన కాదు.. దురహంకార పాలన.. ఇదీ కాంగ్రెస్ పార్టీలో తోటి మనుషులకు ఇచ్చే గౌరవం ఇదేనా..? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైరవుతున్నారు.