ధర్మారం, మార్చి 25: తెలంగాణలో పండే దొడ్డు ధాన్యాన్ని కొనాల్సిందేనని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే రైతాంగం ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలుపై మోదీ సర్కారు దిగొచ్చేదాకా పోరాటం చేస్తామని తేల్చిచెప్పారు. శుక్రవారం ఆయన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాకలో పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు గ్రామస్తులు, టీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. కనకట్ల చంద్రయ్య కూతురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ గూడూరి లక్ష్మణ్ ఇంట్లో టీఆర్ఎస్ శ్రేణులతో సమావేశమయ్యారు. గ్రామస్తుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. వడ్ల కొనుగోలుపై పార్లమెంట్లో ఎంపీలు, ప్రజాక్షేత్రంలో మంత్రులందరం పోరాడుతున్నామన్నారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి గోయల్ బాయిల్డ్రైస్ను కొనబోమని మొండిగా మాట్లాడడం బాధాకరమన్నారు. రాష్ట్ర సర్కారుపై ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలన్నారు. బీజేపీ సర్కారు వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పత్తిపాకను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. చెక్డ్యాంలు, సీసీరోడ్లు, ప్రధాన చౌరస్తాల్లో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రూ. 5లక్షలతో రజక కమ్యూనిటీ హాల్ను నిర్మిస్తామన్నారు. బ్రాహ్మణ కుంట వద్ద అప్రోచ్ రోడ్డు (బీటీ)ను పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆర్అండ్బీ డీఈఈని ఫోన్లో ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న సమస్యను పరిష్కరించాలని ట్రాన్స్కో ఎస్ఈకి సూచించారు. సోమారం కుంట వద్ద గల తన భూమి ఆన్లైన్లో కనిపించడం లేదని రైతు మంత్రి దృష్టికి తీసుకురాగా, సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్ను ఆదేశించారు. నర్సింగాపూర్కు చెందిన కనకట్ల చిన్న సత్తయ్య అర ఎకరంలో సాగు చేసిన వంకాయ తోటను పరిశీలించి రైతును అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బద్దం సుజాత, సింగిల్ చైర్మన్లు ముత్యాల బలరాంరెడ్డి, నోముల వెంకట్రెడ్డి, డైరెక్టర్లు బద్దం రవీందర్రెడ్డి, మెన్నేని వెంకటేశ్వర్రావు, ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, గ్రామ కో ఆర్డినేటర్ రవీందర్, రచ్చపల్లి, రామయ్యపల్లి సర్పంచులు సుధాకర్, సదన్ బాబు, పార్టీ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి కూరపాటి శ్రీనివాస్, నేతలు సురేశ్, బాలు నాయక్, రాజిరెడ్డి, నారాయణ, రవీందర్, సత్యనారాయణరెడ్డి, కొమురయ్య పాల్గొన్నారు.