ఈ ఏడాది ఆఖర్లో స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం బీసీసీఐ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. గత కొన్నేండ్లుగా టీమిండియా ఐసీసీ ప్రతిష్ఠాత్మక ఈవెంట్లలో నిరాశ పరుస్తూ వస్తున్నది. ఈ నేపథ్యంలో జట్టు ఎంపికకు యోయో టెస్టుతో పాటు డెక్సా పరీక్షను తప్పనిసరి చేయడం. సీనియర్ ఆటగాళ్లపై పనిభారం పడకుండా చూసుకునేందుకు ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు ఫిట్నెస్ పెంపొందించడం. మెగాటోర్నీ కోసం 20 మంది ప్లేయర్లను షార్ట్లిస్ట్ చేయడం.. ఇలా కొత్త ఏడాది
తొలి రోజే బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది!
ముంబై: ఈ ఏడాది సొంతగడ్డపై జరుగనున్న వన్డే ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) 20 మంది పేర్లను షార్ట్లిస్ట్ చేసింది. షెడ్యూల్ ప్రకారం జరుగనున్న సిరీస్ల్లో వీరికి అవకాశం ఇచ్చి అందులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని మెగాటోర్నీకి ఎంపిక చేయనుంది. ఆదివారం బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా, కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, ఎన్సీఏ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్, సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ చేతన్ శర్మ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసీస్ వేదికగా నిరుడు జరిగిన టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా సెమీఫైనల్లో ఓటమి పాలై ఇంటి బాట పట్టగా.. ఆ పరాజయం తర్వాత బీసీసీఐ నిర్వహించిన తొలి సమీక్ష సమావేశం ఇదే కావడం గమనార్హం. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్తో పాటు.. వన్డే ప్రపంచకప్పై ఈ సమావేశంలో చర్చించారు. ‘బీసీసీఐ 20 మంది ప్లేయర్లను షార్ట్లిస్ట్ చేసింది. వన్డే ప్రపంచకప్నకు ముందు వీరికి విరివిగా అవకాశాలు కల్పిస్తాం’అని బోర్డు కార్యదర్శి జై షా ప్రకటించాడు. మంగళవారం నుంచి శ్రీలంకతో జరుగనున్న టీ20 ప్రపంచకప్లో భారత జట్టుకు సారథ్యం వహిస్తున్న హార్దిక్ పాండ్యా ఈ సమీక్షలో పాల్గొనలేదు.
ఫిట్నెస్పై దృష్టి..
సొంతగడ్డపై జరుగనున్న వన్డే ప్రపంచకప్ ఒడిసి పట్టేందుకు బీసీసీఐ ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించింది. మెగాటోర్నీ కోసం కోర్ గ్రూప్ను ఎంపిక చేసిన బోర్డు.. ఇక ఆటగాళ్ల పిట్నెస్పై దృష్టి సారించనుంది. జట్టుకు ఎంపిక కావాలంటే యోయో టెస్టుతో పాటు డెక్సా (బోన్ స్కాన్ టెస్టు) పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ఆదివారం ముంబైలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆటగాళ్లపై పనిభారం, విశ్రాంతి, ఫిట్నెస్ వంటి పలు అంశాలపై చర్చించారు. ‘యోయో టెస్టు, డెక్సా పరీక్ష ఉత్తీర్ణులైన ఆటగాళ్లనే జాతీయ జట్టుకు ఎంపిక చేయాలని నిర్ణయించాం’అని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో ప్రపంచకప్ జరుగనుండగా.. యువ ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఎంపికవ్వాలంటే దేశవాళీల్లో ఆడాలని పేర్కొంది. పనిభారాన్ని అంచనా వేసేందుకు సీనియర్ ఆటగాళ్ల ఐపీఎల్ ప్రదర్శనను కూడా బోర్డు పరిశీలించనుంది.
లంకతో మొదలు..
ఇటీవల బంగ్లాదేశ్పై టెస్టు సిరీస్ నెగ్గిన భారత్.. ఇక పరిమిత ఓవర్ల ఫార్మాట్పై దృష్టి సారించనుంది. మంగళవారం నుంచి భారత్, శ్రీలంక మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఈ సిరీస్కు దూరం కావడంతో స్టార్ ఆల్రౌండర్ హర్దిక్ పాండ్యా జట్టుకు సారథ్యం వహించనున్నాడు. వాంఖడే వేదికగా మంగళవారం తొలి పోరు జరుగనుండగా.. దీని కోసం భారత ఆటగాళ్లు కసరత్తులు ప్రారంభించారు. పొట్టి ప్రపంచకప్కు దూకుడైన ఆటగాళ్లనే ఎంపిక చేయాలనుకుంటున్న బోర్డు ఈ సిరీస్ను రిహర్సల్గా తీసుకోనుంది. ఇషాన్ కిషన్, దీపక్ హుడా, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శుభ్మన్ గిల్, సంజూ శాంసన్, రాహుల్ త్రిపాఠి వంటి వాళ్లు తమదైన ముద్ర వేయాలని తహతహలాడుతున్నారు. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనుండగా.. ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్, హర్షల్ పటేల్, పేస్ భారం మోయనున్నారు. తొలిసారి జట్టులోకి వచ్చిన శివమ్ మావి, ముఖేశ్ కుమార్కు అవకాశం దక్కుతుందా చూడాలి.