కైరో : యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి దాడిలో ఐదేళ్ల బాలిక సహా 17 మంది దుర్మరణం చెందారని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మారిబ్లోని రావ్దా పరిసరాల్లోని గ్యాస్స్టేషన్ లక్ష్యంగా దాడి జరిగిందని ప్రొవిన్షియల్ గవర్నర్ ప్రెస్ సెక్రటరీ అలీ అల్ గులిసి పేర్కొన్నారు. దాడిలో 17 మంది మృతి చెందారని, మరో ఐదుగురు గాయపడ్డారని సమాచార శాఖ మంత్రి మొయమ్మర్ అల్ ఇర్యానీ తెలిపారు. క్షతగాత్రులంతా పౌరులేనని పేర్కొన్నారు. క్షిపణి దాడి జరిగిన కొద్దిసేపటికే తిరుగుబాటుదారులు పేలుడు పదార్థాలతో ఉన్న డ్రోన్ను సైతం పేల్చివేశారని ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాబా వార్త సంస్థ తెలిపింది. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలిస్తుండగా డ్రోన్ రెండు అంబులెన్సులను ధ్వంసం చేసిందని పేర్కొంది. అయితే, దాడికి సంబంధించి ఇప్పటి వరకు హౌతీ నుంచి ఎలాంటి ప్రకటన చేయలేదు.