యాదగిరిగుట్ట, జనవరి 14 : పంచనారసింహుడి క్షేత్రం భక్తులతో కోలాహలంగా మారింది. సంక్రాంతి పర్వదినంతోపాటు శనివారం సెలవుదినం కావడంతో యాదగిరిగుట్ట స్వయంభూ నారసింహుడి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. మాఢ వీధులు, క్యూ కాంఫ్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢ వీధులు, గర్భాలయ ముఖ మండపంలోని క్యూలైన్లు భక్తులతో సందడిగా మారాయి. ప్రసాద విక్రయశాలలో సందడి నెలకొన్నది. కొండపైకి వాహనాల రద్దీ సాగింది. తెల్లవారుజాము నుంచే స్వయంభూ నారసింహుడిని దర్శించుకున్న భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. నిత్య తిరుకల్యాణోత్సవం, సువర్ణ పుష్పార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు జరిగే సువర్ణపుష్పార్చన, వేద ఆశీర్వచనం ఘనంగా నిర్వహించారు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు. స్వామి, అమ్మవార్ల నిత్యతిరు కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారిని సుమారు 28 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలుపుకుని స్వామివారి ఖజానాకు రూ. 31,85,784 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
వైభవంగా నిత్యోత్సవాలు..
స్వామివారి నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా సాగింది. ఉదయం స్వామివారికి సుదర్శన నారసింహ హోమం, కల్యాణమూర్తులకు గజవాహన సేవలు నిర్వహించారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పు అభిముఖంగా స్వామి, అమ్మవార్లను వెంచేపు కల్యాణోత్సవం జరిపారు. అనంతరం భక్తులు స్వయంభూ నారసింహుడిని దర్శించుకున్నారు. స్వామివారి నిత్యోత్సవాలు తెల్లవారుజామూ నుంచే మొదలయ్యాయి. ఉదయం సుప్రభాత సేవతో స్వయంభూ నారసింహుడిని మేల్కొలిపిన అర్చకులు తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామివారి సహస్రనామార్చన జరిపారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవం, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజల వైభవంగా నిర్వహించారు. స్వామివారి ధర్మదర్శానికి 2 గంటలు, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టినట్లు భక్తులు తెలిపారు.
స్వామివారి సేవలో సీఎస్ శాంతికుమారి
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి దంపతులు దర్శించుకున్నారు. సీఎస్గా ప్రమాణం స్వీకారం అనంతరం యాదగిరిగుట్ట క్షేత్రానికి చేరుకున్న ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామి దర్శనానంతరం సీఎస్ శాంతికుమారికి ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ ఈఓ ఎన్.గీత ప్రసాదం అందజేశారు. వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
నేడు ఒడిబియ్యం సమర్పణ
ఒడిబియ్యం సమర్పణతో 30 రోజులుగా కొనసాగుతున్న ధనుర్మాస ఉత్సవాలు ముగుస్తాయి. ఆదివారం మధ్యాహ్నం ప్రధానాలయ మండపంలోని కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లకు భక్తులు ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.