అణువణువునా ఆధ్యాత్మిక పరిమళం.. ఎటుచూసినా ఆహ్లాదభరిత వాతావరణం.. ఎక్కడ విన్నా నృసింహ నామస్మరణతో ఎన్నో ప్రత్యేకతల సమాహారంగా నిలిచే.. ఇలవేల్పుగా భక్తులు కొలిచే ప్రఖ్యాత నృసింహ క్షేత్రమైన యాదాద్రి ఆలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. పదకొండు రోజులపాటు అంగరంగ వైభవంగా సాగనున్న వేడుకలతో యాదాద్రి వైకుంఠాన్ని తలపించనున్నది. స్తంభం నుంచి ఆవిర్భవించి ప్రహ్లాదుడిని రక్షించినా, మహారణ్యంలో సింహగర్జన చేస్తూ ఆదిశంకరులను కాపాడినా.. అన్ని వేళల్లోనూ నారసింహుడు భక్తుల వెంట తానున్నానని చాటుతూనే ఉన్నాడు. అలాంటి నృసింహుడిని బ్రహ్మోత్సవాలను చూసి తరించాల్సిందే. శుక్రవారం ఉదయం విష్వక్సేన పూజతో స్వస్తీవాచనం జరిపి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఆ మేరకు ఆలయ అధికార వర్గాలు అన్ని ఏర్పాట్లు చేశాయి. విద్యుద్దీప కాంతుల్లో ఆలయం, పరిసర ప్రాంతాలు జిగేల్ మంటున్నాయి.
లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు యాదాద్రి ముస్తాబైంది. శుక్రవారం ఉదయం విష్వక్సేన పూజతో స్వస్తీవాచనం జరిపి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. 11 రోజులపాటు జరిగే ఈ వేడుకలు 25న శృంగార డోలోత్సవంతో పరిసమాప్తం కానున్నాయి. ఏటా పాల్గుణ మాసంలో, సుమారు 70 మంది పారాయణీకులు, రుత్వికులు, ఆచార్యులు పాల్గొనే ఈ ఉత్సవాలు నేత్రపర్వం కలిగిస్తాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 1న హైదరాబాద్లోని బర్కత్పుర యాదగిరి భవన్ నుంచి ప్రారంభమైన అఖండ జ్యోతి పాదయాత్ర గురువారం సాయంత్రం భువనగిరి పట్టణానికి చేరుకుంది. శుక్రవారం యాదగిరిగుట్టకు చేరుకోవడంతో ఈ యాత్ర పరిపూర్ణం అవుతుంది.
యాదాద్రి, మార్చి 3 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి బ్రహోత్సవాలకు 1955లో శ్రీకారం చుట్టారు. అంతకుమందు భక్తోత్సవాలను నిర్వహించేవారు. అప్పట్లో ఈ ఉత్సవాలు మూడ్రోజులు మాత్రమే జరిగేవి. ఆ తర్వాత ఐదు రోజులకు పెంచారు. గతంలో ఈ ఉత్సవాలు మార్గశిర మాసంలో జరిగేవి. అప్పట్లో కొంత మంది అర్చకులు పాల్గుణ శుద్ధ విదియ నుంచి ద్వాదశి వరకు 11 రోజుల పాటు నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించారు. ఘాట్రోడ్డు లేకపోగా మెట్లదారి కూడా అంతంత మాత్రంగానే ఉండేది. దాంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. రాయగిరి వరకు వివిధ వాహనాల ద్వారా, అక్కడి నుంచి టాంగాలు, ఎండ్ల బండ్ల సాయంతో చేరుకునేవారు. 1985లో యాదగిరిగుట్ట మండలంగా ఏర్పాటు కావడం, అంతకు ముందు 1978లో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయడంతో ప్రయాణ సౌకర్యం మెరుగుపడింది. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్నాటక రాష్ర్టాలతో పాటు మహబూబ్నగర్, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారి బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. మహారాష్ట్రకు చెందిన భక్తులు వారం రోజులు ఇక్కడే ఉండి స్వామివారి ఉత్సవాలు వీక్షించేవారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ వందల కోట్ల వెచ్చించి ఆలయాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దుతుండగా పనులు తుదిదశకు చేరుకున్నాయి. సకల వసతులతో నిర్మిస్తున్న ఆలయంలో వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఆటంకం కలుగకుండా ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. దాంతోపాటు నల్లగొండ వివిధ ప్రాంతాల నుంచి ఈసారి భక్తుల తాకిడి ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు 60 కిలోమీటర్లు, నల్లగొండ నుంచి 90 కిలోమీటర్లు ఉంటుంది. హైద్రాబాద్- సికిందరాబాద్ నుంచి ప్రతి అరగంటకూ ఒక బస్సు ఉంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా యాదగిరిగుట్ట బస్టాండ్ నుంచి కొండపైకి ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సును అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే 4 బస్సులు కొండపైకి నడుపగా అదనంగా మరో 4 బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. మియాపూర్, బీహెచ్ఈఎల్, ఫలక్నుమా, సెంట్రల్ యూనివర్సిటీ డిపోలకు చెందిన వ్రజ బస్సులను యాదాద్రి కొండపైకి నడుపుతున్నారు.
జిల్లా కేంద్రమైన భువనగిరితో పాటు మరో 5 కిలోమీటర్ల దూరంలో రాయగిరిలో యాదాద్రి రైల్వే స్టేషన్ ఉంది. సికింద్రాబాద్ నుంచి వచ్చే రైళ్లు కాకతీయ ప్యాసింజర్, పుష్పుల్, కృష్ణా ఎక్స్ప్రెస్ యాదాద్రి రైల్వే స్టేషన్లో నిలుపుతారు. ఇక సికింద్రాబాద్ నుంచి వరంగల్ వెళ్లే పుష్పుల్, గోల్కొండ, భాగ్యనగర్, కాకతీయ, గౌతమి, మంచిర్యాల, కృష్ణా, ఇంటర్సిటీ, తెలంగాణ, ఈస్ట్కోస్ట్, దక్షిణ్ ఎక్స్ప్రెస్ రైళ్లు భువనగిరి రైల్వేస్టేషన్లో నిలుపుతారు. వరంగల్ నుంచి వచ్చే రైళ్లు సైతం భువనగిరిలో ఆగుతాయి. భువనగిరి నుంచి బస్సుల్లో యాదగిరిగుట్టకు చేరుకోవచ్చు.
విష్వక్సేనపూజ, స్వస్తీవాచనం, రక్షాబంధనం, మంత్రపుష్ప నీరాజనాలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోపణం పూజలు నిర్వహించనున్నారు.
యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవోపేతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. కొండపైకి వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని సదుపాయాలు కల్పించాం. మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం సందర్భంగా ఈసారి కూడా బాలాలయంలోనే బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నాం. బ్రహ్మోత్సవాలు ప్రశాంతంగా ముగిసేలా ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
– ఎన్.గీత, ఈఓ, యాదాద్రి దేవస్థానం
2017 మార్చి 6న శ్రీస్వామి వారి వైభవోత్సవ కల్యాణాన్ని యాదగిరిగుట్ట పట్టణంలోని పాత హైస్కూల్ మైదానంలో నిర్వహించారు. అప్పటి నుంచి ఏటా కల్యాణాన్ని అక్కడే నిర్వహిస్తున్నారు. రథోత్సవాన్ని సైతం కొండ కిందనే నిర్వహించేవారు. అయితే ఈసారి మాత్రం శ్రీవారి తిరు కల్యాణోత్సవాన్ని బాలాలయంలోనే నిర్వహించనున్నారు. చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్లో దాతల సహకారంతో రూపుదిద్దుకున్న బంగారు రథంలో స్వామివారు ఊరేగనున్నారు. అయితే ఈక్రతువును సైతం బాలాలయంలోనే నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాలను బాలాలయంలోనే నిర్వహిస్తున్నందున ఈనెల 4 నుంచి 14 వరకు నిత్యకల్యాణోత్సవం, శాశ్వత కల్యాణం, నిత్య, శాశ్వత బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు సేవలను రద్దు చేసినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.
మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణతో ప్రధానాలయంలో దర్శనాలను పునఃప్రారంభించనుండగా ఈ సారి కూడా బ్రహ్మోత్సవాలను బాలాలయంలోనే నిర్వహించనున్నారు. 2017 సంవత్సరం నుంచి ఐదు పర్యాయాలు బ్రహ్మోత్సవాలను బాలాలయంలోనే నిర్వహించారు. ఆరోసారి నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు బాలాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించారు. హోమ గుండం సిద్ధం చేశారు. అలంకార, సేవా వాహనాలను చూడ ముచ్చటగా తీర్చిదిద్దారు. రాయగిరి కమాన్ నుంచి యాదాద్రి వైకుంఠ గోపురం వరకు ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలు, ఘాట్ రోడ్డు, పట్టణంలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో రాత్రి వేళల్లో యాదాద్రి క్షేత్రం విద్యుత్ కాంతుల్లో స్వర్ణశోభితంగా
సాక్షాత్కరిస్తున్నది.
మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ఉన్నది. ప్రధానాలయం ప్రారంభోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కారణంగానే ఈసారి ఉత్సవాలను బాలాలయంలో ఆంతరంగికంగానే నిర్వహిస్తున్నాం. గతంలో నిర్వహించినట్లుగానే ప్రస్తుత బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశాం.
– బి.నరసింహమూర్తి, అనువంశిక ధర్మకర్త, యాదాద్రి దేవస్థానం
బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం, పోచంపల్లి చేనేత సంఘం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టు వస్ర్తాలను సమర్పించడం ఆనవాయితీ. అయితే, ఈసారి గద్వాల్, కొత్తకోట నుంచి కూడా స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్ర్తాలను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఆలయం తరఫున ఈఓ ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త, టీటీడీ తరఫున టీటీడీ ఈఓ పట్టు వస్ర్తాలను సమర్పించనున్నారు.
భక్తులకు కొండపైన ఇబ్బందులు తలెత్తకుండా బాలాలయం సమీపంలో చలువ పందిళ్లు వేశారు. తాగునీటి వసతి, ఉచిత వైద్య శిబిరాలతోపాటు భక్తుల రద్దీకి అనుగుణంగా లడ్డూ ప్రసాద కౌంటర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు స్వామి అలంకార సేవలను చూసి తరించేలా ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పోలీస్ శాఖ సైతం పటిష్ట నిఘా వ్యవస్థతోపాటు, బందోబస్తు చర్యలను చేపడుతున్నది.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 6 నుంచి 12 వరకు స్వామి వారికి అలంకార సేవలను నిర్వహిస్తారు. 6న ఉదయం మత్స్యావతారం, సాయంత్రం శేష వాహన సేవ, 7న ఉదయం వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి హంస వాహన సేవ, 8న ఉదయం శ్రీకృష్ణాలంకార సేవ, రాత్రి పొన్నవాహన సేవ, 9న ఉదయం గోవర్ధనగిరి అలంకార సేవ, రాత్రి సింహ వాహన సేవ, 10న ఉదయం జగన్మోహినీ అలంకార సేవ, రాత్రి అశ్వవాహనసేవ, 11న ఉదయం హనుమంతుడి సేవ, 12న ఉదయం శ్రీమహా విష్ణు అలంకార సేవలను నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాలకు రాచకొండ కమిషనరేట్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. స్వామి వారి ఎదుర్కోలు, కల్యాణం, రథోత్సవం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండడంతో ఆ రోజుల్లో పెద్ద ఎత్తున బందోబస్తు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పటిష్ట నిఘా వ్యవస్థను సైతం ఏర్పాటు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో కొండపైకి కార్లు, ప్రైవేట్ బస్సులను అనుమతించమని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.