నిర్మల్ అర్బన్ : యాదాద్రి ఆలయ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని 2022 మార్చి 28న ప్రారంభించనున్నామని వెల్లడించారు. నిర్మల్ పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో రూ.15 లక్షల వ్యయంతో నిర్మించిన హింగులాంబిక దేవి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదాద్రి ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములై రూ. 11 విరాళంగా ఇవ్వాలని అన్నారు.
ఆలయాల్లోనే ప్రశాంతత, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని తెలిపారు. నిర్మల్ జిల్లాను ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేశామని, దేవాదాయశాఖ మంత్రిగా రాష్ట్రంలోని 600 ఆలయాలను అభివృద్ధి చేశామన్నారు. ఆలయాల అభివృద్ధి వల్ల ప్రజల్లో భక్తి భావన పెరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు నేరేళ్ల వేణు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, నాయకులు లోలం శ్యాంసుందర్, డి.శ్రీనివాస్, ముడుసు సత్యనారాయణ తదితరులున్నారు.