యాదాద్రి, మార్చి 3 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర నూతనాలయం ఏప్రిల్ 25న పునః ప్రారంభం కానుంది. రాంపూర్ ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామిజీ ముహూర్తం ఖరారు చేసినట్లు ఆలయ అధికార వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 21న శివాలయ ఉద్ఘాటనకు అంకురార్పణ జరిపి 25న పునః ప్రారంభించనున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లలో ఆలయ అధికారులు, శివాలయ పురోహితులు, అర్చకులు నిమగ్నమయ్యారు. మరో రెండు రోజుల్లో తోగుంట పీఠాధిపతి వద్దకెళ్లి ప్రారంభోత్సవ సమయంలో 5రోజుల పాటు నిర్వహించే హోమాలు, మూల మంత్రాలు, పూజల విధివిధానాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణతో ప్రధానాలయం పునః ప్రారంభంకానున్న నేపథ్యంలో అధికారులు బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ మహాతంతు పూర్తికాగానే శివాలయం పునః ప్రారంభించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.
అనుబంధ ఆలయంగా ఉంటూ వస్తున్న పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరాలయంలో ధ్వజ స్తంభం, కర్రలు, ఇత్తడి కలశాలు, తొడుగులకు గతేడాది సెప్టెంబర్ 18వ తేదీన శుద్ది పూజలు చేపట్టారు. శివాలయ ప్రధానాలయానికి ఎదురుగా బిగించనున్న ధ్వజ స్తంభాన్ని ప్రతిష్ఠించనున్నారు. వీటితోపాటు ఇత్తడి కలశ స్థాపన, తొడుగులు అనంతరం సంప్రోక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నారు.