యాదాద్రి, మే 3 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి దేవస్థానాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కొనియాడారు. ఇంత గొప్పగా తీర్చిదిద్దిన కేసీఆర్కు ఆ దేవుడి ఆశీస్సులుండాలని వేడుకొన్నట్టు తెలిపారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారిని మంగళవారం మంత్రి కుటుంబ సమేతంగా దర్శించుకొన్నారు. ప్రధానాలయంలో స్వయంభూ పంచనారసింహుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ప్రాకారంలోని అద్దాల మండపంలో ఆయనకు వేద ఆశీర్వచనం ఇవ్వగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం అందజేశారు. అనంతరం మంత్రి బొత్స మాట్లాడుతూ.. తన ఇష్టదైవమైన యాదగిరిగుట్టకు వచ్చినట్టు తెలిపారు. తెలుగు రాష్ర్టాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకొన్నట్టు చెప్పారు.