యాదాద్రి/ తిమ్మాజిపేట/ మర్కూక్, డిసెంబర్ 6: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ దివ్య విమానగోపురం బంగారు తాపడానికి విరాళాల వెల్లువ కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ పిలుపుతో పలువురు ముందుకొచ్చి విరాళాలు అందిస్తున్నారు. సోమవారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కుటుంబ సమేతంగా యాదాద్రీశుడి సన్నిధికి వచ్చి రూ.55లక్షల డీడీలను ఆలయ ఈవో ఎన్ గీతకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంతో సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. స్వామివారి విమాన గోపురం స్వర్ణతాపడానికి విరాళం అందజేసే అవకాశం రావడం ఆనందంగా ఉన్నదన్నారు. ఆలయ విమాన గోపుర స్వర్ణ తాపడానికి ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన తొలి వేతనాన్ని ప్రకటించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా గుమ్మకొండ వద్ద కంపెనీలో పనిచేస్తున్న హనుమకొండకు చెందిన రమేశ్ కూతురు స్వాతి టెక్ మహీంద్ర కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. తన తొలి వేతనం రూ.20 వేల చెక్కును సోమవారం నాగర్కర్నూల్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డికి అందజేశారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మాజీ జడ్పీటీసీ సింగం సత్తయ్య కుటుంబం రూ.51 వేలను ఆలయ అధికారికి అందజేశారు.
విరాళాల కోసం ప్రత్యేక అకౌంట్
యాదాద్రి ఆలయ విమానగోపురం స్వర్ణతాపడానికి విరాళాల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక బ్యాంకు ఖాతాను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆన్లైన్లో విరాళాలు అందజేసే భక్తులకు ప్రత్యేకమైన క్యూఆర్ కోడ్ను ఉంచారు. నేరుగా వచ్చి విరాళం అందజేసే భక్తులకు బాలాలయంలో హుండీని ఏర్పాటు చేశారు. దీంతోపాటు చెక్కులు, డీడీలు, నగదు, బంగారం నాణేలను ఆలయ అధికారులకు నేరుగా అందజేసే వీలున్నది. ఇలా నేరుగా ఇచ్చిన భక్తులకు ఆలయ అధికారులు రశీదు అందజేస్తున్నారు.