యాదాద్రి భువనగిరి, జనవరి నమస్తే తెలంగాణ ప్రతినిధి: అతివల ఆర్థికాభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా మరో బృహత్తర పథకానికి రూపకల్పన చేశాయి. స్టార్టప్ విలేజ్ ఎంటర్ప్రెన్యూర్ ప్రోగ్రామ్ కింద పలు కార్యక్రమాల నిర్వహణకు జిల్లాలో మోత్కూరు బ్లాక్ను ఎంపిక చేశాయి. ఈ బ్లాక్ పరిధిలోని మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల మండలాల్లో గల స్వశక్తి సంఘాల సభ్యుల ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని వారి వృత్తులు, వ్యాపారాలకు ఆర్థిక చేయూతను అందించనున్నాయి. అందుకోసం రూ.5.97కోట్లను కూడా కేటాయించాయి. త్వరలోనే కార్యరూపంలోకి తెచ్చేందుకుగాను సంబంధిత అధికారులకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అనంతరం మహిళల కుటుంబ ఆర్థిక పరిస్థితులపై సర్వేను చేపట్టనున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో స్వశక్తి సంఘాల మహిళలు ఆర్థికంగా మరింత ఎదిగేందుకుగాను కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ స్టార్టప్ విలేజ్ ఎంటర్ప్రెన్యూర్ ప్రోగ్రాం (ఎస్వీఈపీ) తీసుకొచ్చింది. ఈ పథకాన్ని ఇప్పటికే మూడు విడుతల్లో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అమలు చేయగా.. నాలుగో విడుతలో తెలంగాణలోని పది జిల్లాలకు చోటు కల్పించింది. ఒక్కో జిల్లాలో ఒక్కో బ్లాక్ను ఎంపిక చేసింది. ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలతోపాటు మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణాల రికవరీ, బ్యాంకు లింకేజీలో ముందు వరుసలో ఉన్న ప్రాంతాలను ఈ కార్యక్రమానికి ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో మూడో విడుతలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దేవరకొండ క్లస్టర్ ఎంపికవ్వగా.. ఇప్పుడు నాలుగో విడుతలో మోత్కూరు క్లస్టర్ను ఎంపిక చేశారు. ఈ బ్లాక్ పరిధిలోని మోత్కూరు, అడ్డగూడూరు, ఆత్మకూరు(ఎం), గుండాల మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
5.97కోట్లతో ఆర్థిక చేయూత
స్టార్టప్ విలేజ్ ఎంటర్ప్రెన్యూర్ ప్రోగ్రాం అమలులో భాగంగా ఒక్కో బ్లాక్కు రూ.5.97కోట్ల కేటాయింపు జరుగుతోంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.3.58కోట్లు కాగా.. మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. మోత్కూరు బ్లాక్ పరిధిలోని నాలుగు మండలాల పరిధిలో మొత్తం 2,488 మహిళా సంఘాలు ఉన్నాయి. వాటిల్లో 27,858 మంది సభ్యులు ఉన్నారు. నాలుగేండ్లపాటు అమలులో ఉండే ఈ కార్యక్రమం ద్వారా ఆయా కుటుంబాలు సుస్థిర ఆర్థిక అభివృద్ధి సాధించేలా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టనున్నారు.
బ్లాక్ లెవెల్ రిసోర్స్ సెంటర్
మోత్కూరు కేంద్రంగా బ్లాక్ లెవెల్ రిసోర్స్ సెంటర్ను ఏర్పాటు చేసి కార్యక్రమాలను అమలు చేయనున్నారు. బ్లాక్ పరిధిలోని ఆయా మండలాలకు చెందిన మహిళా సమాఖ్యల ప్రతినిధులు సభ్యులుగా బ్లాక్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తారు. బ్లాక్ లెవెల్ రిసోర్స్ సెంటర్కు ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేసి వచ్చిన నిధులను అందులో జమ చేస్తారు. బ్లాక్ లెవెల్ కమిటీ ఆధ్వర్యంలో ఆ నిధులను ఖర్చు చేస్తారు. ప్రస్తుతం మహిళలు నడుపుతున్న కుటీర పరిశ్రమలు, వ్యాపారాలు, వృత్తులకు చేయూతనందించేందుకు బ్లాక్ రిసోర్స్ సెంటర్ ద్వారా అన్ని రకాలుగా చేయూతనందిస్తారు.
సీఆర్పీల నియామకం పూర్తి
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి పర్యవేక్షణలో ఎస్వీఈపీ కార్యక్రమం అమలవుతుంది. ఇందుకుగాను బ్లాక్కు ఒక ఏపీఎంను కేటాయించారు. అలాగే ఒక్కో మండలం నుంచి ఐదుగురు సీఆర్సీలను నియమించనుండగా.. జిల్లాలో ఈ ప్రక్రియ పూర్తయినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఒక్కో సీఆర్పీకి నాలుగైదు గ్రామాలను కేటాయిస్తారు. వారికి శిక్షణ ఇచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో సర్వే చేయనున్నారు. మహిళా సంఘాల సభ్యుల కుటుంబ ఆర్థిక పరిస్థితులు.. వారు చేస్తున్న పని, పొందుతున్న ఆదాయం వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆదాయంతోపాటు వారి ఖర్చుల వివరాలనూ సేకరిస్తారు. సర్వే ఆధారంగా ఏ కుటుంబం ఆర్థిక పరిస్థితి ఏమిటి? వారు చేస్తున్న వ్యాపారం/వృత్తిని అభివృద్ధి చేసేందుకు ఎలాంటి సహకారం అందించాలన్న దానిపై ఓ నిర్ణయానికి వస్తారు. ఆ తర్వాత స్త్రీనిధి, బ్యాంకు లింకేజీల ద్వారా రుణం ఇప్పిస్తారు.
మార్గదర్శకాలు రావాల్సి ఉంది
స్వయం సహాయక సంఘాల మహిళలు మరింత ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఎస్వీఈపీ పథకం దోహదపడనుంది. ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం అధికారులకు శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవి పూర్తయ్యాక.. బ్లాక్ పరిధిలోని మండలాల్లో సర్వే నిర్వహించి వారు చేస్తున్న వ్యాపారాలు, వృత్తులకు ఆర్థిక చేయూతను అందించే దిశగా చర్యలు తీసుకుంటాం.