‘సంసార సర్పవిషదష్ట భయోగ్రతీవ్ర దంష్ర్టాకరాళ విషధగ్ధ వినష్టమూర్తేః నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్’
కోరిన కోర్కెలు తీరుస్తూ గుహలో స్వయం భువుడై వెలిసిన ఏక శిఖరవాసుడు యాదాద్రి నృసింహుడితో.. భక్తులకు సిరి సంపదలు, సుఖ సంతోషాలు ప్రసాదించే శ్రీమహాలక్ష్మీ అమ్మవారి బ్రహ్మోత్సవ తిరుకల్యాణ సుముహూర్త నిర్ణయ ఘట్టం ఎదుర్కోలు మహోత్సవం ముక్కోటి దేవతల సాక్షిగా గురువారం రాత్రి నయనా నందకరంగా సాగింది.
యాదాద్రి, మార్చి 10 : బాలాలయ ఉత్సవ మండపంలో స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవాన్ని వేద మంత్రాలతో సంప్రదాయరీతిలో వైభవంగా నిర్వహించారు. భక్త జనుల జయ జయ ధ్వానాలు, అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణతో అలంకార నరసింహుడిని అశ్వవాహనంపై బాలాలయం నుంచి ఉత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. స్వామి, అమ్మవార్లను ఎదురెదురుగా ప్రతిష్ఠించారు. ఇరువైపులా అధికారులు, అర్చకులు, రుత్వికులు ఆసీనులై పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. అర్చకులు, వేద పండితులు, అధికారులు స్వామి, అమ్మవార్ల వైపు రెండు జట్లుగా ఎదుర్కోలు తంతును నిర్వహించారు.
అర్చక బృందం అమ్మవారి అందచందాలు, సుగుణాలు కీర్తించారు. అమ్మవారి వైపున యాదగిరిగుట్టకు చెందిన సంస్కృత విద్యాపీఠం విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ధరూరి రామానుజాచార్యులు పాల్గొన్నారు. అమ్మ లేనిది స్వామి లేడు. స్వామిని లోకానికి పరిచయం చేసింది అమ్మవారే అనే అంశాన్ని సోదాహరణంగా వివరించారు. మరోవైపు అర్చక బృందం స్వామివారి మహిమలు, భక్త జన రక్షణలు వివరిస్తూ ఆసక్తికరంగా వాదాలు జరిపారు. స్వామివారి కల్యాణం అమ్మవారితో శుక్రవారం ఉదయం 11 గంటలకు జరుపడానికి సుముహూర్తం నిశ్చయించారు.
పరమాత్మ అద్భుత సౌందర్య స్వరూపమే జగన్మోహిని..
శ్లో: ‘మోహినీరూపమాస్థాయ మాయయా మధుసూదనః వంచయిత్వా సురాన్ సర్వాన్ దేవేభ్యశ్చామృతందదౌ ’మోహం కలిగించేది ‘మోహిని’. మాయకు సంబంధించిన ఆలోచనలు మోహం అని అర్థం. మాయలో పడవేసేది మోహిని. సుగతికోరని అసురులకు మాయా ప్రకృతి యందే ఆసక్తి కలుగుతుందని అర్చకులు స్పష్టం చేశారు. ఆ మాయాసక్తిలో అమృతాన్ని కూడా వదిలేస్తారు. సాత్విక ప్రవృత్తి కలిగిన దేవతలకు విష్ణు రూప మోహిని అమృతాన్ని అందించింది. అనగా సత్వ గుణంతో భగవదన్వేషణ జరిపితే కష్టాలు తొలిగి సకల సుఖాలు, చివరకు పరమాత్మానందంలో లీనమై ముక్తి లభిస్తుందనే దివ్య సందేశాన్ని స్వామివారి జగన్మోహినీ అలంకార సేవ తెలియజేస్తున్నదని ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు వెల్లడించారు.
ముగ్ధమనోహరంగా జగన్మోహినీ అలంకారం…
జగన్మోహినీ అలంకార సేవను బాలాలయంలో అత్యంత వైభవంగా చేపట్టారు. పట్టు వస్ర్తాలు, బంగారు, వజ్ర వైఢూర్యాలు, ముత్యాల ఆభరణాలు, వివిధ పుష్పాలతో స్వామివారిని అలంకరించి ప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చక బృందం, పారాయణీకులు ముందు నడుస్తుండగా బాలాలయంలో ప్రత్యేక సేవను నిర్వహించారు. మూలమంత్ర జపాలు, స్తోత్రాలు, మంత్రోచ్ఛారణ, ఆళ్వారు దివ్య ప్రబంధ పాశురాలను పఠిస్తూ మంగళ వాయిద్యాల నడుమ భక్తులు ‘గోవిందా.. గోవిందా’ అంటూ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎన్.గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, అధికారులు గట్టు శ్రవణ్కుమార్, గజవెల్లి రమేశ్బాబు, దోర్బల భాస్కర్శర్మ పాల్గొన్నారు.
కల్యాణ గుణములను తెలిపేందుకే ఎదుర్కోలు
స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన వేడుక ఎదుర్కోలు మహోత్సవం. జీవాత్మ, పరమాత్మకు నిర్వహించే నిత్య సమ్మేళన రూపమైన పరమార్థతతమే ఈ ఎదుర్కోలు.. అని ఆలయ ప్రధానార్చకులు తెలిపారు. జీవన ప్రతినిధి అయిన అమ్మవారు జీవకోటిని, పరమాత్మతో విడదీయరాని నిత్యసంబంధాన్ని గుర్తు చేసి ఆచార్యులను, ఆత్మజీవతతాలను వెంటబెట్టుకొని పరమాత్మను ఆశ్రయించుట ఈ వేడుకలోని పరమార్థం అని వివరించారు. శ్రీస్వామివారు అశ్వవాహనారూఢుడై భక్తులను అనుగ్రహించుట ఎంతో ప్రశస్థ్యమై ఉన్నది. అశ్వం అనగా ఇంద్రియాలకు సంకేతం.
‘ఇంద్రియాణి హయాన్యాహ్రః అని ఉపనిషద్వాక్యం. జీవకోటి ఇంద్రియ నిగ్రహం పాటించిన జన్మరాహిత్యం కలిగి మోక్షం లభించునని అంతరార్థం. ‘మనః ఏవమనుష్యాణాం కారణం బంధమోక్షయోః’ మనస్సు చంచలమునకు ప్రతీక. అశ్వం వలె చంచలం కలిగిన మనస్సును నిగ్రహించుట భగవానుడికే సాధ్యమని, అభయముద్రతో రక్షించగలనని స్వామి జీవకోటికి అభయమునిచ్చుచూ అనుగ్రహించుట ఈ వాహన సేవ ప్రత్యేకతను కలిగియున్నది. ఎదుర్కోలు మహోత్సవాల్లో అశ్వారూఢుడైన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించిన పరిపూర్ణ అనుగ్రహం, సకల శుభాలు కలుగునని వేదాలు వెల్లడిస్తున్నాయని ఆలయ ప్రధానార్చకులు వివరించారు.
నేడు తిరుకల్యాణ మహోత్సవం
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో విశేష ఘట్టం తిరుకల్యాణ వేడుకలు శుక్రవారం నిర్వహించనున్నారు. ఉదయం 11.00 గంటలకు బాలాలయంలో స్వామివారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 21 నుంచి 28 వరకు మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా యాదాద్రి కొండ కింద పాత స్కూల్ గ్రౌండ్లో నిర్వహించే వైభవ కల్యాణోత్సవం రద్దు చేశారు.
స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పణ
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారికి పట్టు వస్ర్తాలను కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ సమర్పించారు. పట్టు పంచె, 2 పట్టు చీరెలను శ్రీశైలంగౌడ్ సోదరుడు నాగరాజు గురువారం యాదాద్రిలో ఆలయ ఈఓకు అందజేశారు.