రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర హాకీ టోర్నమెంట్కు భువనగిరి వేదికైంది. మొత్తం 10 ఉమ్మడి జిల్లాల జట్లు తలపడుతున్న పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. నల్లగొండ రోడ్డులోని
న్యూ డైమెన్షన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గ్రౌండ్లో మూడ్రోజులపాటు ఉత్కంఠభరితంగా సాగనున్న టోర్నీకి యాదాద్రి భువనగిరి జిల్లా హాకీ సమాఖ్య అన్ని ఏర్పాట్లు చేసింది. గురువారం సాయంత్రమే క్రీడాకారులు చేరుకున్నారు. మైదానంలో ఉత్సాహంగా ప్రాక్టీస్ చేశారు.
భువనగిరి అర్బన్, నవంబర్ 11 : ఐదో రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర అంతర్ జిల్లాల హాకీ టోర్నమెంట్ జిల్లా హాకీ సమాఖ్య ఆధ్వర్యంలో భువనగిరిలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. పట్టణ పరిధిలోని నల్లగొండ రోడ్డులో గల న్యూ డైమెన్షన్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గ్రౌండ్స్లో నిర్వహించే ఈ పోటీలు రాష్ట్రం ఏర్పడి జిల్లాల విభజన తర్వాత మొదటి సారిగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల హాకీ జట్లు గురువారం రాత్రే పట్టణానికి చేరుకున్నాయి. కోచ్, మేనేజర్లకు ఇప్పటికే క్రీడా నిర్వహణపై కోచింగ్ ఇచ్చారు. నేటి ఉదయం 11 గంటలకు మార్చ్ఫాస్ట్ నిర్వహించి జ్యోతి ప్రజ్వలన అనంతరం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, డీసీపీ నారాయణరెడ్డి పోటీలను ప్రారంభిస్తారు. 12, 13న మ్యాచ్లు, 14న సెమీ ఫైనల్స్, ఫైనల్ జరుగుతాయి. ఫైనల్లో గెలుపొందిన జట్లకు అదేరోజు సాయంత్రం బహుమతులు అందజేస్తారు.
పోటీల్లో పాల్గొనే జట్లు..
పోటీలకు నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబాబునగర్ జిల్లాల్లోని హాకీ జట్లు పాల్గొననున్నాయి. ఒక్కో జట్టులో 16 మందితోపాటు ఇద్దరు ఎక్స్ట్రా క్రీడాకారులు, కోచ్, మేనేజర్ ఉంటారు. ఈ పోటీలకు మొత్తం 250 మంది వచ్చారు. పోటీల నిర్వహణకు ఎంపైర్స్ 10 మందితో పాటు పర్యవేక్షణకు భారతహాకీ జట్టు మాజీ కెప్టెన్, ట్రిపుల్ ఒలింపియన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, రాష్ట్ర హాకీ సెక్రటరీ ఎన్.ముఖేశ్కుమార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గురువారం క్రీడల నిర్వాహకులకు కోచింగ్ ఇచ్చారు. పోటీల్లో గెలుపొందిన జట్లకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డితోపాటు ఇతర ముఖ్య అతిథులు బహుమతులు, మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందించనున్నారు.
రాష్ట్రం నుంచి దేశానికి క్రీడాకారుల్ని అందించాలని..
రాష్ట్రం నుంచి హాకీ క్రీడాకారులను తయారుచేసి దేశానికి అందించాలనేదే లక్ష్యం. జిల్లాల్లో పోటీలు నిర్వహిస్తే హాకీ గ్రామస్థాయికి చేరుతుంది. దీంతో గ్రామాల్లోని క్రీడాకారులు వెలికివస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో పోటీలు అంతగా జరిగేవి కాదు. దాంతో ఈ క్రీడపై యువత ఆసక్తి చూపకపోయేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత హాకీ పోటీలు నిర్వహించడంతో యువతకు ఈ క్రీడ చేరువైంది.
పోటీలకు ఏర్పాట్లు పూర్తి
జిల్లా హాకీ సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లాలో మొదటి సారి జరుగుతున్న 5వ రాష్ట్రస్థాయి జూనియర్ బాలుర అంతర్ జిల్లాల హాకీ పోటీలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఉదయం 11 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయి. మూడ్రోజులపాటు జరుగనున్న పోటీల్లో ఉమ్మడి పది జిల్లాల నుంచి 10 జట్లు పాల్గొంటాయి. గెలుపొందిన జట్లకు ప్రథమ, ద్వితీయ, తృతీయ, బహుమతులతోపాటు మెమెంటోలు, ప్రశంపా పత్రాలు అందిస్తాం. ఈ పోటీలు భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్, రాష్ట్ర హాకీ సెక్రటరీ ముఖేశ్కుమార్ పర్యవేక్షణలో జరుగుతాయి.
-బి.కిరణ్కుమార్గౌడ్, హాకీ సమాఖ్య జిల్లా అధ్యక్షుడు
సంతోషంగా వచ్చాం
యాదాద్రి భువనగిరి జిల్లా తక్కువ దూరంలో ఉండడంతోపాటు ఖర్చు తక్కువ కావడంతో ఇక్కడికి సంతోషంగా వచ్చాం. గతంలో హాకీ పోటీలు దూరంలో జరుగడంతో అక్కడికి వెళ్లాలంటే దూరభారం, ఖర్చు ఎక్కువ కావడంతో వెళ్లలేకపోయాం. ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంది. జిల్లాల విభజన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ పోటీలు నిర్వహించినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం.