యాదాద్రి భువనగిరి, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీలతోపాటు ఎక్సైజ్ శాఖకు అనుబంధంగా ఉండే గౌడ్లకు చేయూతనిచ్చేలా కొత్త మద్యం పాలసీని రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు మంగళవారం గౌడ్లకు 21, ఎస్సీలకు 7, ఎస్టీలకు ఒక మద్యం దుకాణం కేటాయించి, ఓపెన్ కేటగిరీలో 53 ఉంచారు. గతంలో ఏ4 లిక్కర్ షాప్లు 69 ఉండగా.. ఈసారి అదనంగా మరో 13 షాపులు పెరిగాయి. అందుకనుగుణంగా నోటిఫికేషన్ను జారీ చేసి, రెండేండ్ల లైసెన్సుల జారీకి గానూ దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టారు. జిల్లాలో మొత్తం 82 దుకాణాలకు గానూ ఈ నెల 18 వరకు దరఖాస్తులు తీసుకుని, 20న లాటరీ పద్ధతిలో కేటాయించనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ఖరారు చేసిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా జిల్లాలో వైన్స్ షాపులు కేటాయించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పాత దుకాణాల గడువు ఈ నెలాఖరుతో ముగియనుండగా కొత్త పాలసీ ప్రకారం జిల్లా ఎక్సైజ్ శాఖ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గౌడ కులస్తులకు 15 శాతం రిజర్వేషన్ను అనుసరించి 21 షాపులు, ఎస్సీలకు 10 శాతం రిజర్వేషన్ ప్రకారం 7 షాపులను, ఎస్టీలకు 5 శాతాన్ని (ఒక షాప్) రోస్టర్ పాయింట్ల ఆధారంగా ఖరారు చేశారు. మద్యం దుకాణాల లైసెన్స్ కోసం దరఖాస్తు ఫీజును గతంలో ఉన్నట్లుగానే రూ.2 లక్షలుగా నిర్ణయించారు. ఈ మొత్తాన్ని చలానా లేదా డీడీ రూపంలో చెల్లించాలి. దుకాణాలు దక్కించుకున్నవారు వార్షిక పన్నును ఆరు వాయిదాల్లో చెల్లించేలా వెసులుబాటు కల్పించారు.
జిల్లాకు 13 అదనపు షాపులు
యాదగిరిగుట్ట, భూదాన్ పోచంపల్లి, ఆలేరు, మోత్కూరు మున్సిపాలిటీలో, బీబీనగర్, అడ్డగూడూరు మండల కేంద్రాల్లో, బొమ్మలరామారం మండలం చీకటిమామిడిలో అదనంగా ఒక్కో వైన్స్ ఏర్పాటు చేయనున్నారు. చౌటుప్పల్ మండలం జై కేసారం, సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్, వలిగొండ మండలం అర్రూర్, మోటకొండూరు మండలం చాడ లేక ముత్తిరెడ్డిగూడెం, తుర్కపల్లి మండలం రుస్తాపూర్ లేదా పల్లెపహాడ్, రాజాపేట మండలం బొందుగుల గ్రామంలో కొత్తగా మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు.
పాటించాల్సిన నిబంధనలు
వైన్స్ ఎదుట పార్కింగ్ స్థలం ఉండాలి. ప్రతి షాపు వద్ద మూడు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. దుకాణాల ఎదుట ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి. మైనర్లకు మద్యం విక్రయించకూడదు, జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంచాలి.
ఆదివారం మినహా అన్నిరోజుల్లో దరఖాస్తుల స్వీకరణ
ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియమద్యం షాపుల లైసెన్స్ జారీకి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 9 నుంచి 18 వరకు చేపడుతున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆదివారం మినహా అన్ని రోజుల్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. భువనగిరి, మోత్కూరు స్టేషన్ల పరిధిలోని షాపులకు దరఖాస్తు చేసేవారు భువనగిరిలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అందజేయాలని, రామన్నపేట, మోత్కూరు పరిధిలోని వారు భువనగిరి ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 19న దరఖాస్తులు పరిశీలించి 20న లక్కీడ్రా ద్వారా ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఆమె వెంట అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, శ్రీనివాస్రెడ్డి, ఎక్సైజ్ సీఐలు నాగిరెడ్డి, నాగలత, చంద్రశేఖర్ ఉన్నారు.