కాన్పూర్ : పిల్లలపై కరోనా టీకా ట్రయల్స్ను భారత్ బయోటెక్ ప్రారంభించింది. ప్రపంచంలోనే తొలిసారిగా రెండు నుంచి ఆరు సంవత్సరాల మధ్య పిల్లలపై టీకా ట్రయల్స్ కాన్పూర్లో ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు ఈ వయసు పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగలేదు. మంగళవారం ఆర్యనగర్లోని ప్రాఖర్ ఆసుపత్రిలో ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. 2-6 సంవత్సరాల వరకు, 6-12 సంవత్సరాల వరకు, 12 -18 సంవత్సరాల మధ్య పిల్లలను మూడు గ్రూపులుగా విభజించారు. మొదటి రోజు 12 నుంచి 18 సంవత్సరాల వయసు గల 40 మంది పిల్లలు పరీక్షలు చేసి, 20 మందిని ఎంపిక చేసి టీకాలు ఇచ్చారు. బుధవారం 6-12 ఏళ్ల మధ్య పది మంది పిల్లలకు బుధవారం పరీక్షలు చేసి, ఇందులో ఐదుగురికి టీకాలు వేశారు.
ఆ తర్వాత 45 నిమిషాల పాటు పిల్లలను పరిశీలనలో ఉంచారు. ఈ సందర్భంగా ట్రయల్స్ చీఫ్, సీనియర్ పిల్లల వైద్య నిపుణుడు ప్రొఫెసర్ వీఎన్ త్రిపాఠి మాట్లాడుతూ రెండేళ్ల వయసున్న పిల్లలపై కరోనా టీకా ట్రయల్ నిర్వహించడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారని తెలిపారు. ఇంతకు ముందెన్నడూ చిన్న పిల్లలపై ట్రయల్స్ జరుగలేదన్నారు. ఇదిలా ఉండగా.. కాన్పూర్ టీకా ట్రయల్స్కు కేంద్రంగా నిలుస్తోంది. కొవాగ్జిన్తో పాటు రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ, జైడస్ క్యాడిలా టీకా ట్రయల్స్ జరిగాయి. ప్రస్తుతం కొవాగ్జిన్ పిడియాట్రిక్స్ ట్రయల్స్ జరుగుతుండగా.. మరిన్ని కంపెనీలు సైతం ఇక్కడ ట్రయల్స్ నిర్వహించాలని యోచిస్తున్నాయని అధికారులు తెలిపారు. వచ్చే నెలలో కొవాగ్జిన్ నాసల్ స్పే ట్రయల్స్ జరుగుతాయని, ఇది అందుబాటులోకి వస్తే గేమ్ ఛేంజర్గా నిలుస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.