ప్రభుత్వ కృషికి దక్కిన ఖ్యాతి
అంతర్జాతీయ విత్తన సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వానం రావడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కృషికి దక్కిన గౌరవం. మరోసారి తెలంగాణ విత్తనరంగం ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఇప్పుడు స్వయంగా ఐక్య రాజ్య సమితే తెలంగాణను ప్రపంచ విత్తన భాండాగారంగా గుర్తించడం గర్వంగా ఉన్నది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణలో విత్తనాభివృద్ధికి గల అవకాశాలను విశ్వవ్యాప్తం చేస్తా.
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కిరీటంలో మరో అరుదైన, అద్భుతమైన కలికితురాయి వచ్చి చేరింది. ‘సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన రాష్ర్టాన్ని ‘ప్రపంచ విత్తన భాండాగారం’గా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఈ నెల 4, 5 తేదీల్లో ఇటలీ రాజధాని రోమ్ నగరం వేదికగా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన అంతర్జాతీయ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) అంతర్జాతీయ విత్తన సదస్సును నిర్వహించనున్నది. ఈ సదస్సుకు తెలంగాణ రాష్ర్టాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించింది. దేశంలో ఈ ఆహ్వానాన్ని అందుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కావడం గమనార్హం. ఈ సదస్సులో ‘ఏ సక్సెస్ స్టోరీ ఆఫ్ ఇండియా: తెలంగాణ స్టేట్ ఈజ్ ఏ గ్లోబల్ సీడ్ హబ్’ అన్న అంశంపై ప్రసంగించాల్సిందిగా ఎఫ్ఏవో ఆహ్వానించడంతో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ విత్తనరంగానికి విశిష్ఠ గౌరవం లభించినట్టయింది. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలకు చెందిన మంత్రులు, కీలక నేతలు, విత్తన ప్రముఖులు, శాస్త్రవేత్తలు, విత్తన పరిశ్రమ ప్రతినిధులు హాజరుకానున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కే కేశవులు పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా విత్తనోత్పత్తిలో తెలంగాణ అభివృద్ధిని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతోపాటు తెలంగాణ ప్రపంచ విత్తన భాండాగారంగా ఎలా ఎదిగిందన్న అంశంపై ఆయన ప్రసంగిస్తారు. ఆయన ప్రసంగం ఏకకాలంలో అంతర్జాతీయ భాషలైన ఇంగ్లిష్, స్పానిష్, ఫ్రెంచ్ భాషల్లో ప్రసారం కానున్నది. తెలంగాణ రాష్ర్టానికి ఈ అరుదైన గౌరవం దక్కడం పట్ల వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషిచేసిన ఎండీ కేశవులును అభినందించారు.
మన విత్తనం.. ప్రపంచవ్యాప్తం
వ్యవసాయ రంగానికి పెట్టింది పేరు తెలంగాణ ప్రాంతం. ముఖ్యంగా విత్తనోత్పత్తికి దేశంలో, ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో అనుకూల వాతావరణం, మౌలిక వసతులు ఉన్నాయి. కాబట్టే 400కు పైగా దేశ విదేశాలకు చెందిన విత్తన కంపెనీలు ఇక్కడ తమ యూనిట్లను ఏర్పాటు చేశాయి. దేశంలో అవసరమైన 60 శాతం విత్తనాలు తెలంగాణ నుంచే సరఫరా అవుతున్నాయంటే విత్తనాభివృద్ధిలో తెలంగాణ సత్తా ఏమిటో స్పష్టమవుతున్నది. ఇక్కడ ప్రతియేటా సుమారు 22-24 లక్షల టన్నుల విత్తనాలు ఉత్పత్తి, ప్రాసెసింగ్ పూర్తి చేసుకుని దేశవిదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.