హైదరాబాద్ : వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ మహిళలు వినూత్న రీతిలో మహిళలు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలిపారు. రాష్ట్రంలో బుధవారం ఎంగిలిపూల బతుకమ్మతో సంబురాలు మొదలయ్యాయి. పండుగ రోజేనే నాన్ సబ్సిడీ గృహ వినియోగ సిలిండర్ (ఎల్పీజీ) ధర రూ.15 పెరిగిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో హుజూరాబాద్లోని ప్రతాపవాడతో పాటు పలు చోట్ల మహిళలు బతుకమ్మల మధ్య సిలిండర్లను పెట్టి తమ నిరసనను తెలిపారు. ‘గ్యాసుల ధరలు పెంచారు ఉయ్యాల్లో.. గరీబు చేస్తున్రు ఉయ్యాలో.. పెట్రోల్ ధర పెంచి ఉయ్యాల్లో ప్రాణాలు తీస్తున్రు ఉయ్యాల్లో.. బీజేపీ మోసాలు ఉయ్యాలో.. ఇక చెల్లనియ్యం ఉయ్యాల్లో’ అంటూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. బతుకమ్మల మధ్యలో సిలిండర్ పెట్టి ఆటలాడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
ఇదిలా ఉండగా.. గడిచిన రెండు నెలల్లో వంటగ్యాస్ ధరలు నాలుగుసార్లు పెరిగాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్పై రూ.205 పెరిగింది. దీంతో సామాన్యులకు గ్యాస్ ధరలు గుదిబండలా మారాయి. మళ్లీ కట్టెలపొయ్యిపై వంట చేసుకునే రోజులు వస్తాయేమోననంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు సైతం ఆకాశాన్ని అంటాయి. హైదరాబాద్లో పెట్రోల్ రూ.107.09, డీజిల్ రూ.99.75 పలుకుతుండగా.. గ్యాస్ రూ.952కు చేరింది.