న్యూఢిల్లీ : పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులపై చట్టాలను కఠినంగా అమలు చేసేందుకు ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చొరవ తీసుకుంది. పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై లైంగిక వేధింపుల నిరోధక, నియంత్రణ చట్టం పకడ్బందీగా అమలు చేయడంలో లోటుపాట్లు ఉన్నాయని డీసీడబ్ల్యూ చీఫ్ స్వాతి మలివాల్ సోమవారం ఢిల్లీ అధికారులకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.
ప్రతి జిల్లాలో కార్యాలయాలు, వాణిజ్య సంస్ధల్లో లైంగిక వేధింపులపై ఫిర్యాదులు స్వీకరించే స్ధానిక ఫిర్యాదుల కమిటీ (ఎల్సీసీ)లు ఇంకా అన్ని చోట్ల ప్రారంభం కాలేదని నివేదిక పేర్కొంది. ఆయా జిల్లాల్లో ఎల్సీసీల వివరాలను నిర్ధిష్ట సమాచారం కోరుతూ జిల్లా మేజిస్ట్రేట్లకు నోటీసులు జారీ చేశామని తెలిపింది.
2019-21 నుంచి అన్ని ఎల్సీసీల పరిధిలో కేవలం 40 ఫిర్యాదులే వచ్చాయని తమ పరిశీలనలో వెల్లడైందని పేర్కొంది. ఢిల్లీలోని ఓ జిల్లాలో మూడేండ్లలో కేవలం మూడు కేసులే వచ్చాయని వెల్లడించింది. పశ్చిమ జిల్లాలో ఒక్క కేసు కూడా వెలుగుచూడలేదని నివేదిక తెలిపింది. తక్కువ ఫిర్యాదులు వచ్చిన చోట కూడా వీటిని సకాలంలో పరిష్కరించలేదని డీసీడబ్ల్యూ నివేదిక అసంతృప్తి వ్యక్తం చేసింది.