అభిమానులను అలరించేందుకు మరో క్రికెట్ పండుగ వచ్చేసింది. నాలుగేండ్లకోసారి జరిగే మహిళల వన్డే ప్రపంచకప్నకు సమయం ఆసన్నమైంది. కరోనా వైరస్ కారణంగా ఏడాది ఆలస్యంగా జరుగుతున్న మెగాటోర్నీకి శుక్రవారం తెరలేవనుంది. ఎనిమిది జట్లు, 31 మ్యాచ్ల పాటు సాగనున్న ఈ టోర్నీకి న్యూజిలాండ్ ఆతిథ్యమిస్తుండగా.. ఆరుసార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా సెవన్త్ వండర్ కోసం చూస్తున్నది. డిఫెండింగ్ చాంపియన్గా అడుగుపెట్టనున్న ఇంగ్లండ్తో పాటు ఆతిథ్య న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా కూడా బలమైన బృందాలతో మెగాటోర్నీకి సిద్ధమవగా.. ఫేవరెట్గా భారత్ బరిలో దిగనుంది. రికార్డు స్థాయిలో ఆరోసారి వరల్డ్కప్ ఆడుతున్న సారథి మిథాలీరాజ్కు కప్పు బహుమతిగా ఇవ్వాలని టీమ్ఇండియా తహతహలాడుతున్నది. మరింకెందుకు ఆలస్యం నెల రోజుల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్కు మీరూ సిద్ధమైపోండి!
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం : కరోనా వైరస్ ప్రభావంతో గతేడాది జరగాల్సిన మహిళల వన్డే ప్రపంచకప్ను పరిస్థితులు అనుకూలిస్తుండడంతో ఐసీసీ ఈ ఏడాది నిర్వహించాలని నిర్ణయించింది. శుక్రవారం మౌంట్మాంగనీ వేదికగా న్యూజిలాండ్, వెస్టిండీస్ మధ్య పోరుతో ప్రారంభం కానున్న మెగా టోర్నీ.. వచ్చే నెల 3న జరుగనున్న ఫైనల్తో ముగియనుంది. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొననున్న ఈ మెగాటోర్నీలో రౌండ్ రాబిన్ పద్ధతిలో ఒక్కో జట్టు మిగిలిన ఏడు జట్లతో పోటీ పడనుంది. లీగ్ దశ ముగిసే సరికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన నాలుగు జట్లు నేరుగా సెమీఫైనల్కు అర్హత సాధించనున్నాయి. మెగాటోర్నీకి మూడోసారి న్యూజిలాండ్ ఆతిథ్యమిస్తుండగా.. భారత కాలమానం ప్రకారం సింహభాగం మ్యాచ్లు తెల్లవారుజామునే ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టోర్నీకి సంబంధించిన నియమాలు, నిబంధనలు, విశేషాలు ఓసారి పరిశీలిస్తే..
ఎనిమిది జట్లు..
ఆతిథ్య హోదాలో న్యూజిలాండ్ నేరుగా ప్రపంచకప్నకు అర్హత సాధించగా.. 2017-2021 మహిళల చాంపియన్షిప్ ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, భారత్ మెగాటోర్నీ బెర్త్ దక్కించుకున్నాయి. క్వాలిఫయింగ్ టోర్నీల ద్వారా మిగిలిన మూడు జట్లను ఎంపిక చేయాలని భావించినా.. కరోనా ప్రభావంతో ఆ టోర్నీలు సజావుగా సాగక పోవడంతో వన్డే ర్యాంకింగ్స్ ఆధారంగా పాకిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లకు వరల్డ్కప్లో పాల్గొనే అవకాశం దక్కింది.
బంగ్లా అరంగేట్రం
పురుషుల క్రికెట్లో ఇప్పుడిప్పుడే ప్రధాన జట్టుగా ఎదుగుతున్న బంగ్లాదేశ్.. మహిళల క్రికెట్లో తొలిసారి వన్డే ప్రపంచకప్నకు అర్హత సాధించింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 15 జట్లు కనీసం ఒక్కసారైనా ప్రపంచకప్ బరిలో దిగాయి.
ఆరు వేదికల్లో..
కరోనా ప్రభావం కారణంగా బయోబబుల్లో జరుగనున్న ఈ మెగాటోర్నీని ఆరు వేదికల్లో నిర్వహించనున్నారు. లీగ్ స్థాయిలో గెలిచిన జట్టుకు రెండేసి పాయింట్లు లభించనున్నాయి. లీగ్ మ్యాచ్లు టై అయితే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించనున్నారు. టోర్నీ ఆరంభంలో 10 శాతం మంది అభిమానులను అనుమతించనున్నారు. మ్యాచ్లు సాగుతున్నా కొద్ది పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు.
సూపర్ ఓవర్లే.. సూపర్ ఓవర్లు
లీగ్ మ్యాచ్లకు రిజర్వ్ డే, సూపర్ ఓవర్ వంటివి లేకపోయినా.. సెమీఫైనల్స్, ఫైనల్కు అందుబాటులో ఉన్నాయి. 2019 పురుషుల వన్డే ప్రపంచకప్ ఫైనల్ ‘టై’కాగా సూపర్ ఓవర్లో కూడా ఇంగ్లండ్, న్యూజిలాండ్ స్కోర్లు సమం అవడంతో ఎక్కువ బౌండ్రీలు కొట్టిన జట్టును విజేతగా ప్రకటించారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో ఐసీసీ నిబంధనలను మార్చింది. నాకౌట్ మ్యాచ్లు ‘టై’అయితే ఫలితం తేలేంత వరకు సూపర్ ఓవర్లు నిర్వహించనున్నారు. వరుసగా రెండో ప్రపంచకప్లోనూ డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) కొనసాగనుంది. ఒక్కో జట్టుకు రెండు రివ్యూల అవకాశం ఉండనుంది.
భారీ ప్రైజ్మనీ
గత టోర్నీలతో పోల్చుకుంటే ఈసారి నగదు బహుమతి బాగా పెరిగింది. వచ్చే నెల 3న జరుగనున్న మెగా ఫైనల్ విజేతకు పది కోట్ల రూపాయల ప్రైజ్మనీ అందనుంది. ఇది డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్కు 2017లో అందిన మొత్తానికి రెండింతలు కావడం గమనార్హం. ఇక రన్నరప్గా నిలిచిన జట్టుకు రూ. 5 కోట్లు దక్కనున్నాయి. సెమీఫైనల్లో ఓటమి పాలైన జట్లు చెరో రెండున్నర కోట్లు ఖాతాలో వేసుకోనున్నాయి.
ఆ ముగ్గురిదే ఆధిపత్యం..
ఇప్పటి వరకు 11 సార్లు మహిళల వన్డే ప్రపంచకప్ జరుగగా.. అందులో సగం కంటే ఎక్కువసార్లు (6) ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. క్రికెట్కు పుట్టినిైల్లెన ఇంగ్లండ్ నాలుగు ట్రోఫీలను ఖాతాలో వేసుకోగా.. న్యూజిలాండ్ ఒకసారి విజేతగా నిలిచింది. టోర్నీ ఆరంభం నుంచి ఆస్ట్రేలియాదే ఆధిపత్యం అనేది స్పష్టమవుతుండగా.. ఈ టోర్నీలో అత్యుత్తమంగా భారత జట్టు రెండుసార్లు (2005, 2017లో) రన్నరప్గా నిలిచింది. ఇటీవలి కాలంలో విదేశాల్లోనూ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న భారత జట్టు.. ఈ సారి ఫేవరెట్గా టోర్నీలో అడుగుపెడుతున్నది.
రికార్డు స్థాయిలో..
మహిళల క్రికెట్లో మరే ప్లేయర్కు సాధ్యంకాని రికార్డులు ఖాతాలో వేసుకున్న భారత సారథి మిథాలీరాజ్ ఆరోసారి ప్రపంచకప్ బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నది. తన అద్వితీయ ప్రదర్శనతో లెక్కకు మిక్కిలి ఘనతలు సాధించిన మిథాలీ.. ఎప్పటి నుంచో ఊరిస్తున్న ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడాలని తహతహలాడుతున్నది. 39 ఏండ్ల మిథాలీకి ఇదే చివరి ప్రపంచకప్ కానుండగా.. ఈ టోర్నీ అనంతరం ఆటకు వీడ్కోలు పలకాలనే ఆలోచన ఉన్నట్లు ఇటీవలే వెల్లడించింది. మరి లేడీ సచిన్కు అందని ద్రాక్షలా ఉన్న ప్రపంచ చాంపియన్ బిరుదు ఈ సారైనా దక్కుతుందో చూడాలి!