అమరావతి : బడ్జెట్ సమావేశాల వేళ ఏపీ అసెంబ్లీలో అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. రేపటి మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అధికార కూటమికి చెందిన మహిళా ప్రజా ప్రతినిధులు ఒకే రంగు చీరలు ధరించి సభకు రావడంతో అసెంబ్లీలో ఆధ్యాత్మిక, ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు భారతీయ సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తూ ఒకే రకమైన వస్త్రధారణతో సభకు హాజరయ్యారు.
ఆదివారం మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా.. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి సహా పలువురు మహిళా ప్రజాప్రతినిధులు శివతత్వానికి ప్రతీకగా నిలిచే ప్రత్యేకమైన చీరలను ధరించి సభకు వచ్చారు. వారి రాకతో శాసనసభ ప్రాంగణం కళకళలాడింది. మంత్రులు గుమ్మిడి సంధ్యారాణి, ఎస్ సవితతోపాటు ఇతర మహిళా ఎమ్మెల్యేలు సైతం ఈ ప్రత్యేక డ్రెస్ కోడ్ను పాటించారు. ఒకే రంగు, ఒకే తరహా వస్త్రధారణతో కనిపించిన వారు సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా మహిళా ఎమ్మెల్యేలంతా కలిసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు చూపిన ఉత్సాహాన్ని, వారి ఐక్యతా స్ఫూర్తిని పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు. సంస్కృతీ సంప్రదాయాలకు విలువ ఇస్తూ.. పండుగ స్ఫూర్తిని సభకు తీసుకురావడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. మహిళా శక్తికి, వారి సంఘటితత్వానికి ఇది నిదర్శనమని కొనియాడారు.
ఇదిలావుంటే రాజకీయాలకు అతీతంగా శాసనసభ వేదికగా మన సంప్రదాయాలను గౌరవించుకోవడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ ముందస్తు శివరాత్రి వేడుకల సందడి అసెంబ్లీకి కొత్త శోభను తీసుకొచ్చింది.