బెలూచిస్తాన్ : ఒక మహిళా ఉద్యోగి పట్ల పాకిస్తాన్ ప్రభుత్వం ఎక్కడలేని ఆగ్రహం ప్రదర్శిస్తున్నది. ఆమె చేసిన తప్పేమీ లేనప్పటికీ ఉద్యోగం చేరిన 36 రోజుల్లో నాలుగు సార్లు బదిలీ చేసి మహిళలపై తమకున్న చిత్తశుద్ధి ఏపాటిదో చెప్పకనే చెప్పారు బెలూచిస్తాన్ అధికారులు.
ప్రభుత్వ నిర్వాకం పట్ల సదరు మహిళ ఆగ్రహం వ్యక్తం చేయకుండా ఉండటం విశేషం. ప్రభుత్వం తనకు ఏది మంచి అనిపిస్తే అది చేస్తుందని ఆవిడ చెప్తుండటం విశేషం. బెలూచిస్తాన్కు చెందిన ఫరీదా తరీన్ అనే మహిళ ఈ ఏడాది ఫిబ్రవరి 11 న ప్రభుత్వ ఉద్యోగంలో చేరింది. క్వెట్టా నగర అసిస్టెంట్ కమిషనర్గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. నాలుగు రోజులకే ఆమెకు పరిపాలనా విభాగానికి మార్చారు.
వారం రోజులు గడిచాయో లేదో మరోసారి బదిలీ చేస్తూ ఆమెను సాధారణ పరిపాలనా విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. అక్కడ కుదురుకుంటున్న తరుణంలో 20 రోజులకే మరోసారి బదీలీ అయింది. ఇప్పుడు ఆమె వాణిజ్యం, పరిశ్రమల శాఖలో చేరారు. అయితే, మహిళా అధికారులపై వివక్షత భావనను బలూచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి లియాఖత్ షావానీ తోసిపుచ్చారు, బదిలీలు ఉద్యోగంలో భాగం అని తమ పనిని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు.
మహిళా అధికారిపై వివక్ష చూపిన కేసును అక్కడి ప్రభుత్వ ప్రతినిధి ఖండించినప్పటికీ, పాకిస్తాన్లో మహిళలు తమ రోజువారీ జీవితంలో సమస్యలను ఎలా ఎదుర్కొంటున్నారో విస్తృతమైన ఆధారాలు చూపిస్తున్నాయి. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్-2018 లో మహిళల విషయంలో ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆరవ దేశంగా పాకిస్తాన్ నిలిచింది.
లింగ సమానత్వం పరంగా ప్రపంచంలో రెండవ చెత్త దేశంగా ఉన్నది. అంతర్జాతీయ కార్మిక సంస్థ నుంచి అందిన సమాచారం ప్రకారం, స్త్రీ, పురుష ఉద్యోగుల మధ్య అంతరం ప్రపంచంలోనే పాకిస్తాన్లో విశాలమైనది. పాకిస్తాన్లో మహిళలు పురుషుల కంటే 34 శాతం తక్కువ సంపాదిస్తున్నట్లు ఈ నివేదిక తేల్చింది.