హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): విద్యాబుద్ధులు నేర్పిన బడిని అక్కున చేర్చుకొనేందుకు ఎన్ఆర్ఐలు కదులుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగస్వాములు కాబోతున్నారు. శుక్రవారం ప్రగతిభవన్లో మంత్రి కేటీఆర్తో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బడిని బాగుచేసుకోవటానికి సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేందుకు త్వరలో ఎన్ఆర్ఐలతో జూమ్లో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డిని కూడా ఆహ్వానించామని పేర్కొన్నారు. ఎన్ఆర్ఐలు వారి స్వగ్రామాల్లో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగస్వాములై చదువుకొన్న పాఠశాలలను అభివృద్ధి చేస్తారని వెల్లడించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను అందుబాటులోకి తీసుకొస్తున్నందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీర్, సబితా ఇంద్రారెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. దీని ద్వారా తెలంగాణ బిడ్డలు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో, ప్రపంచంలో ఎకడైనా పోటీ పరీక్షల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందని చెప్పారు.