బీజేపీకి అనుకోని ఝలక్ ఇచ్చిన జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్ ప్రధాని మోదీ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. ‘2014లో గెలిచిన మోదీ.. 2024లో గెలువగలరా?’ అని ప్రశ్నించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో విజయావకాశాలపై బీజేపీకి బెంగ తప్పదని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు.ఎనిమిదోసారి బీహార్కు సీఎంగా నితీశ్ బుధవారం ప్రమాణం చేశారు. డిప్యూటీ సీఎంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ బాధ్యతలు చేపట్టారు.
పాట్నా, ఆగస్టు 10: బీహార్లో మహాఘట్బంధన్ నేతృత్వంలో బుధవారం కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా జేడీ(యూ) అధినేత నితీశ్ కుమార్ ఎనిమిదోసారి ప్రమాణం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ, బీజేపీపై నిప్పులు చెరిగారు. ‘2014లో గెలిచిన మోదీ.. 2024లో గెలువగలడా?’ అని సూటిగా ప్రశ్నించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో విజయావకాశాలపై బీజేపీకి కలవరపాటు తప్పదని చెప్పారు.
కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని పదవికి తాను పోటీదారుగా లేనన్నారు. బీజేపీని వీడాలని తమ పార్టీ నేతలందరూ ఏకగ్రీవంగా నిర్ణయించారని పునరుద్ఘాటించారు. కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగబోదంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా తోసిపుచ్చారు. ఈడీ, సీబీఐ కేసులకు తాను, తమ నేతలు భయపడబోమని తేల్చిచెప్పారు. కూటమిలోని కీలక పార్టీ అయిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
బీజేపీ అధినాయకత్వంపై కొంతకాలం ఆగ్రహంతో ఉన్న నితీశ్.. మంగళవారం ఎన్డీయే కూటమి నుంచి బయటకువచ్చి సీఎం పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. ఆర్జేడీ, కాంగ్రెస్ సహా 7 పార్టీల మద్దతుతో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ మళ్లీ సీఎంగా ప్రమాణం చేశారు. హిందీ మాట్లాడే రాష్ర్టాల్లో ఎక్కువసార్లు సీఎంగా ప్రమాణం చేసిన వ్యక్తిగా నితీశ్ రికార్డు సృష్టించారు. బీహార్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివిన ఆయన.. రాజకీయాలపై ఆసక్తితో ఆ దిశగా అడుగులు వేశారు. 1985లో తొలిసారిగా శాసనసభ్యుడిగా గెలిచారు. 2003లో శరద్యాదవ్, జార్జ్ ఫెర్నాండేజ్తో కలిసి జేడీ(యూ)ని ఏర్పాటు చేశారు.
బీజేపీ పెద్దలు కూడా ఊహించలేదు
నితీశ్ ఎన్డీయేతో తెగదెంపులు చేసుకుంటారని బీజేపీ అధిష్ఠానం ముందుగానే గ్రహించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే బద్ధశత్రువైన ఆర్జేడీతో నితీశ్ మళ్లీ చేతులు కలిపి, కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని బీజేపీ అధినాయకత్వం అస్సలు ఊహించలేదని పేర్కొన్నాయి. నితీశ్ ప్రతిపాదనకు ఆర్జేడీ సానుకూలంగా స్పందించడం బీజేపీకి పెద్ద షాక్ అని వెల్లడించాయి. ‘నితీశ్ ఓ పాము. సర్పం కుబుసాన్ని ఎలా విడుస్తుందో.. నితీశ్ ప్రతీ రెండేండ్లకు ఒకసారి కొత్తవారితో జట్టు కడతారు’ అని 2017లో లాలూప్రసాద్ చేసిన ట్వీట్ను.. మంగళవారం బీజేపీ సానుభూతిపరులు పెద్దయెత్తున షేర్ చేశారు. అలాంటి తీవ్రవ్యాఖ్యలు చేసిన లాలూ పార్టీతో నితీశ్ మళ్లీ జట్టుకడతారని బీజేపీ అస్సలు ఊహించి ఉండదంటూ నెటిజన్లు కూడా పలు ట్వీట్లు పెట్టారు.
జాతీయ స్థాయిలో ప్రభావం చూపలేవు: ప్రశాంత్ కిశోర్
బీహార్లో తాజా పరిణామాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు. 2017లో బీజేపీతో నితీశ్ పార్టీ తిరిగి జట్టు కట్టిందని, అయితే, కమలదళం నేతలతో ఆయన అంత సౌకర్యంగా లేరన్నారు. బీహార్లో జరిగిన తాజా పరిణామాలు ఇతర రాష్ర్టాలతో పాటు జాతీయ స్థాయిలో ఇప్పటికిప్పుడు ప్రభావం చూపకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
తేజస్వీని స్కామ్లో ఇరికించాలనుకున్న బీజేపీ: లలన్ సింగ్
సీఎం నితీశ్తో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తిరిగి జట్టు కట్టకుండా బీజేపీ అన్ని ప్రయత్నాలు చేసిందని జేడీ(యూ) జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ తెలిపారు. ఇందుకోసం తేజస్వీని ఐఆర్సీటీసీ కుంభకోణంలో ఇరికించేందుకు కుట్ర పన్నినట్టు ఆరోపించారు. అయితే, ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నదని, ఈ అవినీతి కేసుతో తేజస్వీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
మాఫ్ కీజియేగా రబ్రీదేవీతో నితీశ్
బీజేపీతో తెగదెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించిన అనంతరం మంగళవారం సాయంత్రం జేడీ(యూ) అధినేత నితీశ్.. ఆర్జేడీ నేత తేజస్వీ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మాజీ సీఎం రబ్రీదేవీతో ముచ్చటించిన నితీశ్.. ‘మాఫ్ కీజియేగా’ (నన్ను క్షమించండి)’ అని పేర్కొన్నట్టు సమాచారం. 2015లో ఆర్జేడీతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్.. 2017లో ఆర్జేడీతో తెగదెంపులు చేసుకొని బీజేపీతో జట్టు కట్టడం తెలిసిందే.
ఫికర్ మత్ కరో
విపక్షాలనే కాదు.. మిత్రపక్షాలను కూడా నమ్మించి వంచించడం బీజేపీకి వెన్నతోపెట్టిన విద్య. ఇది బాగా తెలిసిన బీహార్ సీఎం నితీశ్కుమార్ కమలం నేతలకు వారి తరహాలోనే ఝలక్ ఇచ్చారు. బీజేపీతో తెగదెంపులు చేసుకోవడానికి ముందు రోజు అమిత్షా ఆయనకు ఫోన్ చేశారు. పరిస్థితి ఏంటని ఆరాతీశారు. దీనికి నితీశ్ బదులిస్తూ.. ‘ఫికర్ మత్ కరో (మరేం భయంలేదు. ఆందోళన పడొద్దు)’ అంటూ ఆయనకు భరోసా ఇచ్చారు. అయితే ఆ మరుసటి రోజే బీజేపీకి గుడ్బై చెప్పి తేజస్వీతో జట్టుకట్టారు. ఈ విషయాన్ని బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ తాజాగా వెల్లడించారు. గడిచిన ఏడాదిన్నర కాలంలో ప్రధాని మోదీ కూడా ఎన్నోసార్లు నితీశ్తో ఫోన్లో మాట్లాడారని, అయితే, రాష్ట్రంలో పరిస్థితులపై ఆయనెప్పుడూ ప్రధానికి ఫిర్యాదు చేయలేదని చెప్పుకొచ్చారు.