సిలిగురి: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ కీలక ప్రకటనచేశారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. దేశంలో కోవిడ్ కేసులు తగ్గాక ఆ చట్టాన్ని అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. బెంగాల్ పర్యటనలో ఉన్న హోంశాఖ మంత్రి అమిత్ షా అక్కడ ఈ కీలక ప్రకటన చేశారు.
సిలిగురిలో జరిగిన పబ్లిక్ ర్యాలీలో మంత్రి షా ఈ ప్రకటన చేశారు. సీఏఏ అమలు చేయడంలేదని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు షా ఆరోపించారు. నేను ఇవాళ ఉత్తర బెంగాల్కు వచ్చానని, సీఏఏపై టీఎంసీ తప్పుడు ప్రచారం చేస్తోందని, కోవిడ్ తగ్గిన తర్వాత సీఏఏను అమలు చేస్తామని షా తెలిపారు.
సీఏఏ ఉద్దేశ్యమేంటి..?
పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి భారత దేశానికి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, పార్శీలు, బౌద్ద మతస్తులు, క్రైస్తవులకు భారత పౌరసత్వం ఇవ్వడమే పౌరసత్వ సవరణ చట్టం ఉద్దేశ్యం. 2014 డిసెంబర్ 31 కంటే ముందు వచ్చిన వారికి పౌరసత్వాన్ని కల్పిస్తారు. ఐతే దీనిపై 2019లో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.