ఇది తెలంగాణ! ఏడేండ్ల క్రితం పుట్టిన కొత్త రాష్ట్రం! దశాబ్దాలపాటు అన్యాయాలకు, వివక్షకు, వలస పాలకుల అణచివేతకు గురైన ప్రాంతం! ఈ రాష్ర్టాన్ని సాధించుకునేందుకు ఇక్కడి ప్రజలు దశాబ్దాలపాటు పోరాటాలు చేశారు. మలి విడతలో ప్రాణాలు అర్పించారు.. చావు నోట్లో తల పెట్టారు!
ఇలా ఏర్పడిన కొత్త రాష్ర్టానికి కేంద్రం సాయం చేయాల్సింది ఎంత? చేస్తున్నది ఎంత? నోటితో నవ్వి.. నొసటితో వెక్కిరించినట్టు.. మాట తీయగా ఉంటుంది.. కానీ ఇచ్చేది మాత్రం మట్టే! చివరకు దేశం నలుమూలల నుంచి ప్రతినిధులున్న అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటు చేసిన పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చటానికి పాలక పెద్దలకు చెయ్యి రాదు!
పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయరు.. రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలు.. మంత్రులు, ఎంపీలు అనేక సందర్భాల్లో సమర్పించిన విజ్ఞాపన పత్రాలను బుట్టదాఖలు చేస్తారు! ఆఖరుకు.. తెలంగాణకు ఇచ్చేది లేదని తెగేసి చెప్పిన ప్రాజెక్టులను ఇతర రాష్ర్టాలకు ఇవ్వటానికి మాత్రం వెనుకాడరు! ఇదీ తెలంగాణపై కేంద్రంలోని
పెద్దల కక్షపూరిత వివక్ష!
ఇక ఇక్కడి ప్రజలు గెలిపించిన నలుగురు బీజేపీ ఎంపీలు.. రాష్ట్ర ప్రభుత్వంపై పొద్దున్న లేస్తే కారాలు మిరియాలు నూరడం తప్ప.. పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల ఎంపీల తరహాలో.. పార్టీలకు అతీతంగా నిలబడి.. మా రాష్ర్టానికి సాయం ఎందుకు చేయరు? అని నిలదీసే చేవ కూడా లేకపోయింది.
రాబోయే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లోనైనా నలుగురు బీజేపీ ఎంపీలు కేంద్రంపై కొట్లాడి రాష్ర్టానికి ఏమైనా తెస్తారా? వాళ్ల విజ్ఞప్తులను ప్రధాని మోదీ ఆలకిస్తారా? ఆర్థిక మంత్రి నిర్మల వరాలిస్తారా?
హైదరాబాద్, జనవరి 21: ‘మాటలు కోటలు దాటుతాయి.. కాళ్లు తంగేళ్లు దాటవు’ అన్న సామెత బీజేపీ నేతలకు సరిగ్గా సరిపోతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి ఏడేండ్లవుతున్నా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీల్లో ఒక్కటి కూడా కేంద్రం నెరవేర్చలేదు. బీజేపీ నేతలు మాత్రం తెలంగాణను పూర్తిగా కేంద్ర నిధులతో సాకుతున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ర్టానికి న్యాయంగా రావాల్సిన ప్రాజెక్టుల గురించి, మంజూరు కావాల్సిన నిధుల గురించి ఏనాడూ కనీసం నోరెత్తని బీజేపీ నేతలు, ‘అంతా మేమే ఇచ్చాం.. మొత్తం మేమే తెచ్చాం’ అని గప్పాలు కొట్టుకొంటున్నారు. త్వరలో కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ చట్టం హామీలను నెరవేర్చుతుందో లేదో స్పష్టం చేయాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హామీల అమలుకు రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరుతున్నారు. విభజన చట్టంలో పొందుపరిచి తెలంగాణకు మొండిచెయ్యి చూపిన ప్రధాన హామీలను పరిశీలిస్తే..
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో 10వ అంశం కింద స్పష్టంగా పేర్కొన్నారు. వరంగల్లోని కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటవుతుందని అందరూ భావించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్యాక్టరీ కోసం దాదాపు 60 ఎకరాలను కేటాయించింది. సుమారు రూ.40 కోట్ల నిధులు సైతం విడుదల చేసింది. అనేకసార్లు ప్రధాని మోదీ, కేంద్ర రైల్వేశాఖ మంత్రికి ఈ విషయాన్ని గుర్తు చేసింది. అయినా పట్టించుకోలేదు. చివరికి 2016 మార్చి 11న రాజ్యసభలో ‘ఇప్పటికే ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు కోచ్ ఫ్యాక్టరీలు దేశ ప్రస్తుత, భవిష్యత్తు రైల్వే అవసరాలను తీర్చుతాయి. కొత్తవాటి అవసరం లేదు’ అని నాటి కేంద్ర రైల్వే సహాయ మంత్రి మనోజ్సిన్హా చావు కబురు చల్లగా చెప్పారు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ
ఇల్లెందు నియోజకవర్గంలోని బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కేవలం విభజన హామీ మాత్రమే కాదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మార్మోగిన నినాదం. ‘బయ్యారం ఉక్కు.. తెంగాణ హక్కు’ అని ప్రజలంతా నినదించారు. విభజన చట్టంలోని 13వ షెడ్యూల్లో బయ్యారంలో సెయిల్ ఆధ్వర్యంలో రూ.36 వేల కోట్లతో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ 51 హెక్టార్లలో అపార ముడిఖనిజ నిక్షేపాలు ఉన్నాయని గతంలోనే నిర్ధారించారు. ఏటా 4 లక్షల టన్నుల ఖనిజాన్ని వెలికి తీసినా 22 ఏండ్లకు సరిపడా నిల్వలు ఉన్నాయని గణించారు. దేశంలో లభ్యమవుతున్న ముడి ఇనుములో 11 శాతం బయ్యారంలోనే ఉన్నదని, దీని నాణ్యత 60 శాతం ఉండొచ్చని అంచనా వేశారు. అవసరమైతే ఛత్తీస్గఢ్ నుంచి ముడి ఇనుమును తీసుకొచ్చేందు రైల్వే శాఖ సర్వే నిర్వహించేందుకు 2018 ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసింది. అయినా దీనిపై ఏడేండ్లుగా కేంద్రం ఉలుకూ పలుకూ లేదు.
గిరిజన యూనివర్సిటీ
తెలంగాణలో దాదాపు 12 శాతం జనాభా గిరిజనులు. దీంతో రాష్ట్రంలో ప్రత్యేకంగా గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో కేంద్రం స్పష్టంగా పేర్కొన్నది. వర్సిటీ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లా జాకారంలో 300 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. పక్కా భవనాలు నిర్మించేదాకా గిరిజన శాఖకు చెందిన వైటీసీ భవనాన్ని వినియోగించుకోవాలని సూచించింది. అయినా కేంద్రం పట్టించుకోవడం లేదు. అదే సమయంలో చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి గిరిజన వర్సిటీని మంజూరు చేసింది. ఒక్క గుంట జాగా కేటాయించకపోయినా, భవనాలు నిర్మించకపోయినా.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన చిన్న భవనంలోనే వర్సిటీని ప్రారంభించింది.
ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా
ఏపీలోని పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన నేపథ్యంలో.. తెలంగాణలో ఏదైనా ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్రం స్పష్టంగా చట్టంలో పేర్కొన్నది. తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం లేదా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అనేక మంది మత్రులు, ఎంపీలు ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చివరగా 2018 ఆగస్టులో అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ‘ఇకపై ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇచ్చేది లేదు’ అని ప్రకటించారు. కానీ ఆ తర్వాత కర్ణాటక, మధ్య ప్రదేశ్ల్లోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చి.. తెలంగాణకు ధోకా ఇచ్చారు.
వెనుకబడిన జిల్లాలకు నిధులు
విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.50 కోట్ల చొప్పున విడుదల చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. ఈ లెక్కన ఏటా రూ.450 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నది. ఈ నిధుల విడుదలకు కేంద్రం పదే పదే తిప్పించుకుంటున్నది. పలుమార్లు లేఖలు రాస్తే రెండుమూడేండ్లకు ఒకసారి విడుదల చేస్తూ సహనాన్ని పరీక్షిస్తున్నది. ఇప్పటికీ రెండేండ్ల బకాయిలు రూ.900 కోట్లు రావాల్సి ఉన్నది. వీటి విడుదలపై ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఉలుకూపలుకూ లేదు. రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణలో 10 జిల్లాలు మాత్రమే ఉండేవి. ఇందులో 9 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించారు. ఇప్పుడు పాలనా సంస్కరణల ఫలితంగా రాష్ట్రం 33 జిల్లాలుగా మారింది. ఈ లెక్కన కనీసం 31 జిల్లాలకు ఒక్కొక్క జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున ఇవ్వాలని తెలంగాణ విజ్ఞప్తి చేస్తున్నది. కేంద్రం ఈ హామీని పట్టించుకోవడం లేదు.
షెడ్యూల్ 9,10 సంస్థల విభజన
రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ 9, 10 లో చేర్చిన ఉమ్మడి ఆస్తుల విభజన ఏడేండ్లవుతున్నా ఇప్పటికీ కొలిక్కి రాలేదు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం తెలంగాణ, ఏపీ మధ్య చిచ్చు పెట్టి చోద్యం చూస్తున్నది. న్యాయబద్ధంగా వాటాలు ఉన్న సంస్థల విభజన ఇప్పటికే పూర్తయింది. మిగతా సంస్థల విభజనను సైతం పూర్తి చేయడంలో కేంద్రం తాత్సారం చేస్తున్నది. జనవరి 12వ తేదీన కేంద్రం తూతూ మంత్రంగా ఓ వీడియోకాన్ఫరెన్స్ పెట్టి ‘తాంబూలాలు ఇచ్చాం.. తన్నుకు చావండి’ అన్నట్టుగా చెప్పి ముగించారు.
అసెంబ్లీ స్థానాల పెంపుదలపై సూచన
తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలను పునర్వ్యవస్థీకరించి 153కు, ఏపీలోని 175 స్థానాలను 225కు పెంచే అంశాన్ని పరిశీలించాలని పార్లమెంటు సాక్షిగా నాటి యూపీఏ విభజన చట్టంలో పొందుపర్చింది. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హామీపై పరిశీలన కాదుకదా.. ఏకంగా ఆ అంశాన్నే తుంగలో తొక్కింది. ఎన్నిసార్లు అడిగినా దాటవేస్తూ వచ్చిన బీజేపీ సర్కారు గతేడాది ఆగస్టు 3న లోక్సభలో అసలు ఉద్దేశాన్ని బయటపెట్టింది. 2031 వరకు అసెంబ్లీ స్థానాలు పెంచే అవకాశమే లేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న నిత్యానందరాయ్ తేల్చిపారేశారు.
తెలంగాణ ఏర్పడి ఏడేండ్లవుతున్నది. పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చనేలేదు. వాటిని.. బీజేపీ ఎంపీలు తెస్తారా? మోదీ ఇస్తారా?