Collector Satya Prasad | సారంగాపూర్, జులై 7 : గ్రామాల్లో అర్హులైన ప్రతీ ఓటరు నమోదు అయ్యేలా విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లో ఆయన మంగళవారం పర్యటించారు. మండలంలోని నాయకపు గూడెంలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ సర్వెను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. బీర్పూర్ మండలంలోని చిన్న కొల్వాయి, తుంగూర్, తాళ్లధర్మరం గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న గ్రామ పంచాయతీ భవనాలు, పాఠశాలల వంట గదుల నిర్మాణాలు పరిశీలించారు. తుంగూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ నమోదు దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరీశీలించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నమోదు ప్రక్రిను చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌళిక వసతులు కల్పించడంతో పాటు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలను త్వరిత గతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. పాఠశాలల్లో నిర్మిస్తున్న వంట గదులు అన్ని సౌకర్యాలతో పూర్తి చేయాలని అన్నారు. తుంగూర్ గ్రామంలో పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో జగిత్యాల ఆర్టీఓ మధుసుధన్, ఈఈ పీఆర్ లక్ష్మణ్ రావు, తహసీల్దార్లు వహిదొద్దిన్, సుజాత, ఎంపీడీఓలు నీరజ, భీమేష్, బీఎల్ఎలు, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.