న్యూఢిల్లీ : యువకులు, మధ్య వయసు వారు అనూహ్యంగా గుండె పోటుతో కుప్పకూలుతున్న ఘటనలు ఇటీవల పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. జమ్ముకు చెందిన యోగేష్ గుప్తా వేదికపై ప్రదర్శన ఇస్తుండగానే కుప్పకూలి మరణించిన ఘటన కలకలం రేపింది. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. యువకుల్లో గుండె జబ్బులు వైద్యారోగ్య నిపుణుల్లో ఆందోళన కలిగిస్తోంది. భారత్లో యువకుల్లోనూ గుండె పోటు కేసులు పెరుగుతుండటంపై చర్చ జరుగుతోంది. పలువురిలో కొవిడ్-19 అనంతరం గుండె పోటు ఘటనలు పెరుగుతున్నట్టు గుర్తించారు. ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలడానికి కారణాలు, వీటిని నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై హృద్రోగ నిపుణులు, హార్ట్ సర్జన్లు పలు సూచనలు చేస్తున్నారు.
జీవనశైలి, మానసిక ఒత్తిడి, కొవిడ్-19 కారణంగా గుండె పోటు ఘటనలు పెరుగుతున్నాయని హార్ట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెదాంతకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మనీష్ బన్సల్ చెప్పారు. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడమే గుండె పోటుకు ప్రధాన కారణమని ఆయన వివరించారు. దీనితో పాటు మానసిక ఒత్తిడితో ధమనులు చిట్లడం, కొలెస్ట్రాల్ పేరుకుపోవడం గుండె పోటుకు దారితీస్తాయని చెప్పారు. ఇక కొవిడ్-19 సోకినవారిలో ధమనలు, రక్తనాళాలు దెబ్బతినడం కూడా గుండె పోటుకు కారణంగా చెబుతున్నారు. ఇక అనారోగ్యకర జీవన శైలితో పాటు వ్యాయామం చేయకపోవడం, పొగతాగడం, మద్యపానం కూడా హృద్రోగాలకు కారణమని అన్నారు. మరోవైపు కఠిన శారీరక శ్రమ చేసే ముందు, భారీ ఎక్సర్సైజ్లు చేసే వారు ముందుగా గుండె పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
శరీరంలో కొవ్వు అధికంగా ఉన్నవారు. గుండె కొట్టుకునే వేగంలో తేడాలున్నవారు కొత్తగా వ్యాయామం, కఠిన శారీరక శ్రమకోర్చే పనులు చేసే ముందు విధిగా ఆయా పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్ బన్సల్ స్పష్టం చేశారు. గుండె పోటు వచ్చే ముందు ప్రధాన లక్షణం ఛాతీ నొప్పి ఉంటుందనే అపోహ చాలా మందిలో ఉందని, అయితే ఇది కరెక్ట్ కాదని ఛాతీలో ఎలాంటి అసౌకర్యం, ఛాతీ మంట, బరువుగా ఉండటం, ఛాతీ మధ్యలో నొక్కినట్టు ఉండటం, చెమటలు పట్టడం, వాంతులు, విపరీతమైన అలసట వంటివి గుండె పోటు లక్షణాలుగా భావించాలని చెప్పారు. ఈ లక్షణాలను గుర్తిస్తే తక్షణమే కార్డియాలజిస్ట్ను సంప్రదించాలని ఆకాష్ హెల్త్కేర్కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆశిష్ అగర్వాల్ చెబుతున్నారు.