న్యూఢిల్లీ: గుజరాత్ మత కలహాలపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని నిషేధించటంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. డాక్యుమెంటరీ నిషేధ నిర్ణయానికి సంబంధించి అన్ని ఒరిజినల్ రికార్డులతో పాటు నిషేధిస్తూ జారీచేసిన ఉత్తర్వుల కాపీ సమర్పించాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఎంఎం సుంద్రేశ్తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సవాల్చేస్తూ జర్నలిస్టు ఎన్ రామ్, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్భూషణ్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఒక పిటిషన్, న్యాయవాది ఎంఎల్ శర్మ మరో పిటిషన్ దాఖలు చేశారు. వీటిని కలిపి విచారించిన ధర్మాసనం, మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్రం ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు కూడా నిరాకరించింది. డాక్యుమెంటరీని దేశమంతటా ప్రజలు చూస్తూనే ఉన్నారని, అందువల్ల మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని జస్టిస్ ఖన్నా పేర్కొన్నారు.
స్వేచ్ఛపై ఆంక్షలా?
గుజరాత్లో 2002లో జరిగిన మత హింసపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించటాన్ని దేశంలోని శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు తీవ్రంగా ఖండించారు. కేంద్రప్రభుత్వ చర్య దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు ప్రమాదమని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు 500 మంది శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. ‘అన్ని రకాల అభిప్రాయాలను గౌరవించినప్పుడే ఉత్తమ విద్య అందించినట్టు అవుతుంది. ఇలాంటి అంశాలపై బహిరంగంగా చర్చించాలి. ఈ చర్చలు సరైన విద్యకు చాలా ముఖ్యం’ అని పేర్కొన్నారు. డాక్యుమెంటరీలో కొత్త అంశాలు ఏమీ లేవని, 2002లో జాతీయ మానవ హక్కుల కమిషన్ గుర్తించిన అంశాలనే ప్రస్తావించారని తెలిపారు. అలాంటప్పుడు దానిని నిషేధించటం సహేతుకం కాదని సూచించారు. భావప్రకటనపై సెన్సార్షిప్ విధించటం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తంచేశారు.