ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిష్టంభన ఏర్పడినట్లు తెలుస్తోంది. శివసేన నేతృత్వంలోని కూటమికి ఇప్పుడు కష్టకాలం వచ్చింది. సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం ప్రమాదంలో పడినట్లు సంకేతాలు అందుతున్నాయి. శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబాటు వల్లే ఉద్దవ్ సర్కార్ మైనార్టీలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకీ మహారాష్ట్రలో ఎవరి బలం ఎంతో తెలుసుకుందాం. మహా అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉన్నాయి. శివసేన ఎమ్మెల్యే రమేశ్ మృతితో ఒక సీటు ఖాళీగా ఉంది. ఇక మంత్రులు అనిల్ దేశ్ముఖ్, నవాబ్ మాలిక్లు ఇద్దరూ జైలులో ఉండి రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్కు దూరం అయ్యారు. దీంతో ఆ ఎన్నికల్లో శివసేనకు భంగపాటు ఎదురైంది.
శివసేనకు 55 సీట్లు, ఎన్సీపీకి 53, కాంగ్రెస్కు 44, బీజేపీకి 106 సీట్లు ఉన్నాయి. బహుజన్ వికాస్ అగాధీకి మూడు, సమాజ్వాదీ, ఎంఐఎం, జనశక్తి పార్టీలకు చెరో రెండు సీట్లు ఉన్నాయి. ఎంఎన్ఎస్, సీపీఐ, పీడబ్ల్యూపీ, స్వాభిమాన్, రాష్ట్రీయ సమాజ్ పక్ష్, జనసూరజ్యశక్తి, క్రాంతికార్ షేత్కారి పార్టీలకు ఒక్కొక్క సీటు ఉన్నాయి. వీరితో పాటు 13 మంది స్వతంత్య్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 144 సీట్లు ఉంటే సరిపోతుంది. అయితే ఏక్నాథ్తో పాటు పది మంది శివసేన ఎమ్మెల్యేలు సూరత్లో క్యాంప్ పెట్టడం వల్ల మహారాష్ట్ర అసెంబ్లీలో సంక్షోభం ఏర్పడే సంకేతాలు కనిపిస్తున్నాయి.
మహా వికాశ్ అవధి ప్రభుత్వంలో ఏక్నాథ్ షిండే.. పట్టణ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. అనేక ప్రాంతాల్లో శివసేన పార్టీని బలోపేతం చేసిన నేతల్లో ఏక్నాథ్ ఒకరు. ఇటీవల ఆయన ఆదిత్య థాకరేతో కలిసి అయోధ్య కూడా వెళ్లారు. మహా అసెంబ్లీకి వరుసగా నాలుగు సార్లు ఎన్నికయ్యారు. 2004, 2009, 2014, 2019లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో శివసేన లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా చేశారు. పార్టీలో ఆయనకు మంచి సపోర్ట్ ఉంది. భారీ భారీ ఈవెంట్లను ఆర్గనైజ్ చేస్తుంటారు. ఏక్నాథ్ కుమారుడు శ్రీకాంత్ షిండే లోక్సభ ఎంపీ. సోదరుడు ప్రకాశ్ షిండే కౌన్సిలర్గా ఉన్నారు. తనను పక్కనపెట్టడం వల్లే ఏక్నాథ్ శివసేన పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.