న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల పెరుగుదల పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనామ్ గెబ్రియసస్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి 2022లో సమసిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ పంపిణీలో అసమానతలు తొలగిస్తే మనం ఈ మహమ్మారిని అంతం చేయవచ్చని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ అధనామ్ గెబ్రియసస్ స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా వైరస్ కేసులు పెరుగుతుంటే కొన్ని దేశాలు వ్యాక్సిన్ నిల్వలను పెంచుకుని కూర్చున్నాయని మండిపడ్డారు. సంకుచిత జాతీయవాదం, కొన్ని దేశాలు సమాన పంపిణీని పక్కనపెట్టి వ్యాక్సిన్ల నిల్వలను పెంచుకోవడం ఒమిక్రాన్ వ్యాప్తికి దారితీసిందని ఆరోపించారు. అసమానతలు దీర్ఘకాలం కొనసాగితే వైరస్ మనం నివారించలేదని నియంత్రించలేని స్ధాయికి చేరుతుందని ఆయన హెచ్చరించారు.
గత రెండేండ్లుగా మహమ్మారి మనల్ని వెంటాడుతున్న క్రమంలో ప్రపంచం మూడో ఏడాదిలోకి అడుగుపెడుతోందని మనమంతా ఐక్యంగా పోరాడితే ఈ ఏడాది మహమ్మారిని అంతమొందించగలమనే విశ్వాసం తనకుందని అన్నారు. ఒమిక్రాన్, డెల్టా కేసుల సునామీ ప్రపంచాన్ని ముంచెత్తడం పట్ల కలత చెందుతున్నానని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి టీకాలు దొరకడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.