చైనాను టాంగ్ రాజవంశం పాలించే సమయంలో, చదువంటే బాగా ఇష్టపడే లీబో అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన పదివేలకు పైగా గ్రంథాలు చదివాడు. దీంతో అందరూ అతణ్ని ‘పదివేల గ్రంథాల లీ’ అని పిలిచేవారు. ఒకసారి అతను జిజాంక్ అనే సన్యాసిని ‘సుమేరు పర్వతాన్ని ఒక ఆవ గింజలో పట్టించవచ్చు అని విమలాకీర్తి నిర్దేశ సూత్రాల్లో ఒక భాగంలో రాసి ఉంది. అంతటి పెద్ద పర్వతం ఒక చిన్న ఆవ గింజలో ఎలా ఇముడుతుంది?’ అని అడిగాడు. దానికి జిజాంక్ ‘అందరూ నిన్ను ‘పదివేల గ్రంథాల లీ’ అని అంటారు. మరి పదివేల గ్రంథాలు నీ చిన్న బుర్రలో ఎలా పట్టాయి?’ అని బదులిచ్చాడు.
సద్గురు: ఈ ఆవగింజ పోలిక, ముఖ్యంగా యోగ సూత్రాల నుంచి వచ్చింది. అందులో, ఈ సృష్టి మొత్తాన్ని ఒక ఆవగింజలో పట్టించవచ్చు అనే ఉదాహరణ వాడుతారు. ఆవగింజ మనం నిత్యం ఉపయోగించేదే! పైగా అతిచిన్న వస్తువుల్లో ఒకటి. దేశకాలాలనేవి మన మనసులో సృష్టించుకున్నవి. అందుకే ఈ సృష్టిని అంతా ఆవగింజలో ఇమడ్చవచ్చు. తార్కికమైన బుద్ధికి ఇది అర్థం కావడం చాలా కష్టం. కానీ, ఇదే విషయాన్ని విజ్ఞానశాస్త్రం, మనిషి ప్రస్తుత తార్కిక స్థాయికి మించిన రీతిలో, పలు రకాలుగా విశ్లేషించింది. కాలం, స్థలం రెండిటినీ మనం పొడిగించడం లేదా కుంచించడం చేయవచ్చునని ఆధునిక విజ్ఞాన శాస్త్రం మనకు స్పష్టంగా చెబుతున్నది. అనుభవపరంగా, ఇది సాధ్యమే. ఒక మనిషి ఒకానొక స్థితిలో ఉన్నప్పుడు, కాలం ఇట్టే కుదించుకుపోతుంది. చాలామందికి ఇది అనుభవంలోకి వస్తుంటుంది. మనిషి ఆనందంగా ఉన్నప్పుడు 24 గంటలు ఒక్క క్షణంలా గడిచిపోతాయి. అదే దుఃఖంలో ఉన్నప్పుడు 24 గంటల కాలమే ఒక సంవత్సరంగా అనిపిస్తుంది.
దేశకాలాలు అనేవి చాలా సాపేక్షమైన అనుభవాలు. నా స్వానుభవంలో, కొన్ని స్థితుల్లో ఉన్నప్పుడు, ఒక రోజు ఒక క్షణంలా గడిచిపోతుంది. నాకు రెండు నిమిషాలు అనిపిస్తే అప్పటికే 7-8 గంటలు గడిచిపోతుంది. ఒక్కోసారి ఇలా రోజుల తరబడి అలా కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటి సమయంలో అందరూ నేనేదో అసాధారణమైన కార్యం చేస్తున్నానని అనుకుంటారు. కానీ, నా అనుభవంలో అది కేవలం 25 – 30 నిమిషాలు మాత్రమే. అలా కూర్చోవడానికి ఏ విధమైన కష్టం గానీ, ప్రయాస గానీ అనిపించదు. ఇదేదో అసాధారణమైన కార్యం కాదు! ఎందుకంటే మీ మనసు పరిమితులను దాటితే, సమయం, దూరం అనేవి ఉండవు. దేశకాలాలు మీ మనసులోని సృష్టి. ఈ కథలో, ఆ ప్రత్యేకమైన ధ్యానస్థితిని వివరించారు. మీరు నిజంగా ధ్యానస్థితిలో ఉంటే, మీకు దేశకాలాలు రెండూ ఉండవు.
ప్రేమాశీస్సులతో సద్గురు ఈశా ఫౌండేషన్
గర్భిణికి సీమంతం ఎందుకు చేస్తారు?
సనాతన ధర్మం చెప్పే సందేశమేంటి.. శ్రీవిజయేంద్ర సరస్వతి మహాస్వామి ఏమన్నారు?