Jagadguru adi shankaracharya jayanti | కంచి పరమాచార్య ‘శాస్త్ర సంరక్షణ’ దీప్తి. శ్రీజయేంద్ర సరస్వతి స్వామివారు ‘సమాజ సంరక్షణ’ స్ఫూర్తి. ఈ రెండు తత్తాలూ కలగలసిన మూర్తి శ్రీవిజయేంద్ర సరస్వతి మహాస్వామి. ఇద్దరు గురువులు సంధించిన ఆధ్యాత్మిక చైతన్య శరం ఆయన. కంచి పీఠం పరంపరకు సమున్నత రీతిలో ఆచార్యత్వాన్ని వహిస్తున్నారు. జగద్గురువు ఆదిశంకరాచార్యుల ఆశయాలను.. ఆదేశాలుగా స్వీకరించి సనాతన ధర్మ పరిరక్షణకు అహరహం కృషి చేస్తున్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా తెలంగాణలో విజయయాత్రకు విచ్చేశారు. ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా శ్రీవిజయేంద్ర సరస్వతి మహాస్వామితో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక సంభాషణ..
నేటి సమాజంలో సనాతన ధర్మం తన అస్తిత్వం కోసం పోరాడుతున్నది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
దశాబ్దాలుగా భారతదేశం పురోగతి సాధిస్తున్నది. అయితే, అదంతా భౌతిక పునరుద్ధరణే. ఆధ్యాత్మికంగా జరగాల్సింది ఇంకా చాలా ఉన్నది. అప్పుడే సమగ్ర వికాసం సాధ్యం. రహదారుల నిర్మాణం, నీటి వసతి, సాంకేతికత, విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి.. ఇవన్నీ భౌతిక అభివృద్ధి. ధార్మికతను సంరక్షించే ప్రయత్నం జరగాలి. ఇందుకోసం కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి. భారతావని చైతన్య దేశం. మన ఆచారాలు, విచారాలు అన్నిటిలో మనిషిని భాగం చేయాలి. అందరికీ గౌరవం, అందరికీ బాధ్యత, అందరికీ భద్రత సనాతన ధర్మ సందేశమిది. దీనికి విస్తృత ప్రచారం కల్పించి, ఆచరణలోకి తేవాలి.
సనాతన ధర్మాన్ని పరిపుష్ఠం చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి?
దేవాలయ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. అలాగే మన విద్యా వ్యవస్థలో ధార్మికమైన మార్పులు తీసుకురావాలి. ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు, ఇంజినీరింగ్ కళాశాలలు ఇలా విద్యారంగం పురోగమిస్తున్నది. అదే సమయంలో ధార్మిక విద్యపైనా ప్రభుత్వాలు దృష్టి సారించాలి. సంగీతం, శిల్పశాస్త్రం, నాట్యం, భక్తి సాహిత్యం, వేద విద్యలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ వాటిని అభివృద్ధి చేయాలి. శాస్త్రం చదువుకున్న విద్యావంతులను తీర్చిదిద్దాలి. టెక్నాలజీలో ఐఐటీ, మేనేజ్మెంట్లో ఐఐఎం ఉన్నట్టుగా వేదంలోనూ ఉన్నత విద్య విస్తృతంగా అందుబాటులోకి రావాలి. గోశాల, వేద పాఠశాల, అన్నసత్రం, కల్యాణ మంటపం నిర్వహణ ఇలా ధార్మిక విషయాల్లోనూ ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించాలి. దేవాలయ పరిరక్షణ, కళల అభివృద్ధితోపాటు వేద వాఙ్మయాన్ని రక్షించాలి. అప్పుడు మన జీవనశైలిలో మార్పు వస్తుంది. మనుషుల ఆలోచనలు బాగుపడుతాయి. సమాజానికి శ్రేయస్సు కలుగుతుంది.
జగద్గురువు ప్రబోధించిన అద్వైత సిద్ధాంతాన్ని ఈ కాలానికి ఎలా సమన్వయం చేసుకోవాలి?
శతాబ్దాల కిందట ఆదిశంకరాచార్యులు ప్రతిపాదించిన అద్వైతం ప్రస్తుత కాలానికి అత్యావశ్యకం. ప్రశాంతత, ఓపిక, ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఇప్పుడు చాలా అవసరం. భగవంతుడు సృష్టిలో అందరికీ సమానమైన అవకాశాలు ఇచ్చాడు. వాటిని మనం ప్రేమతో పంచుకోవాలి. భగవంతుడు ఇచ్చిన సంపదను త్యాగపూర్వకంగా, ప్రేమ పూర్వకంగా మనలో మనం సమంగా పంచుకుంటే అందరికీ సుఖం కలుగుతుంది. సుఖం పొందడానికి సుముఖంగా ఉండాలి. సుముఖంగా ఉంటే ఆ సుముఖుడు (వినాయకుడు) అనుగ్రహిస్తాడు. అద్వైత తత్తాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయాలి. భారతదేశం తరఫున ఈ సందేశాన్ని అందరికీ పంచాలి. భారతదేశాన్ని ధర్మ ప్రచార కేంద్రంగా తీర్చిదిద్దాలి.
కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని అపర శంకరులు అని అభివర్ణిస్తారు. వారి అనుగ్రహం ఎలా ఉండేది?
పరమాచార్య వారి తపోశక్తినంతా సమాజానికే అంకితం చేశారు. సూర్య కిరణాలు ఎలాగైతే అంతటా ప్రసరిస్తాయో, స్వామివారి అనుగ్రహం కూడా అందరిపై సమానంగా వర్షించేది. మహాత్మాగాంధీ గారికి దర్శనమిచ్చారు, పూరిగుడిసెలో ఉన్న నిరుపేద భక్తుడినీ అనుగ్రహించారు. వారు ధర్మ స్వరూపం. అంతటి మహాత్ముడు ప్రజల కోసం కిందికి దిగి వచ్చారు. చదువుకున్న వారి మధ్యా పనిచేశారు. సామాన్య మనుషుల మధ్యా తిరిగారు. సామాజిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి దశకంలో ఒక ప్రత్యేక కార్యాచరణతో దిశా నిర్దేశం చేసేవారు. ధార్మిక ప్రచారంలో భాగంగా విద్యారణ్య భాష్యం, ధర్మశాస్త్ర సభ, వేద సంక్షేమం ఇలా రకరకాల కార్యక్రమాలు నిర్వహించేవారు. వ్యాస భారత సదస్సు పేరుతో సాహితీ సదస్సులు, అవధానాలతోపాటు బుర్రకథలు, వీధి నాటకాలు, తోలుబొమ్మలాటలు లాంటి జానపద కళల ద్వారా సనాతన ధర్మం గొప్పదనం అందరికీ అర్థమయ్యేందుకు పాటుపడ్డారు. సామాన్య మానవులకు కూడా ఈశ్వర అనుగ్రహం కలిగేలా చేశారు. ‘వేదపాఠ నిధి’ ద్వారా వృద్ధాప్యంలో ఉన్న వేద పండితులకు పెన్షన్ అందించే ఏర్పాటు చేశారు.
శ్రీజయేంద్ర సరస్వతి స్వామివారి కాలంలో కంచి పీఠం ప్రస్థానం ఎలా కొనసాగింది?
‘ఉద్యమః కార్యసాధకః’ అనే మాటకు శ్రీజయేంద్ర సరస్వతి స్వామివారు ఉదాహరణ. శాస్త్ర సంరక్షణ మహాస్వామి వారి విధానమైతే, సమాజ సంరక్షణ శ్రీజయేంద్ర సరస్వతి స్వామివారి విధానం. ప్రేమ, ఔదార్యం, మందహాసం వారిలో కనిపించేవి. ఉత్సవ మూర్తి, ఉత్సాహ మూర్తి, ఉద్యమ మూర్తి, అందరికీ ఉపయోగ మూర్తి వారు. ‘ప్రయత్నం లేని పని ఫలితాన్నివ్వదు. పరిశ్రమిస్తే తప్పక ఫలితం కలుగుతుంది’ అనేవారు స్వామివారు. హిందూ సమాజ సమైక్యత కోసం ఆయన ఎంతగానో పాటుపడ్డారు. గ్రామాల్లో దేవాలయాల పునరుద్ధరణకు కృషిచేశారు. సామూహిక పూజలను ప్రోత్సహించేవారు. హిందూ ధర్మ ప్రచారంలో సామాజిక తత్త్వాన్ని ప్రవేశపెట్టారు. నిరంతరం ప్రజలకు ఏదో మేలు చేయాలని తపించేవారు. ఆకలి బాధ తీరితే ఆలోచనలో మార్పు వస్తుందని చెప్పేవారు. నిరుపేదలకు బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించి వాళ్లు స్వయం ఉపాధి పొందే అవకాశం కల్పించారు. ఆదిశంకరులు కనకధార స్తోత్రం చేసి నిరుపేద భక్తురాలి ఇంట బంగారు ఉసిరికాయల వర్షం కురిపించినట్టు, స్వామివారు కూడా నిరుపేదలకు ఆర్థికంగా సాయం చేస్తుండేవారు. ఆర్థికంగా నిలదొక్కుకొని బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించినవారికి ప్రోత్సాహకాలు కూడా అందించేవారు. అర్చక సంక్షేమం, సామూహిక వివాహాలు, వైద్య సేవలు తదితర సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేశారు. సమకాలీన సమస్యలపై స్పందించేవారు. పరిహారాలూ సూచించేవారు.
తెలంగాణలో ఆధ్యాత్మిక వాతావరణంపై మీ అభిప్రాయం?
తెలంగాణలో అన్ని రంగాల్లో పురోగతి కనిపిస్తున్నది. ఆధ్యాత్మికంగా రాష్ట్రం విశేషంగా కృషి చేస్తున్నది. దేవాలయాల అభివృద్ధి, వేద పండితులకు సత్కారం చేయడం ఆహ్వానించదగ్గవి. పేదింటి ఆడపిల్లల పెండ్లికి ప్రభుత్వం సాయం చేస్తుండటం విశేషం. హరితహారం, చెరువుల పునరుద్ధరణ రాష్ట్ర అభివృద్ధితోపాటు ధర్మ నిర్వహణకూడా ముఖ్యం. యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడానికి చెరువు (హోమ ద్రవ్యం) అవసరం. పొలాలు పండటానికి చెరువు (జలం) అవసరం. ఈ రెండూ సమృద్ధిగా ఉన్నాయిక్కడ. మరోవైపు యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. వేములవాడ, కొండగట్టు ఆలయాలను కూడా ప్రభుత్వం పునర్నిర్మించనున్నట్టు తెలిసింది. ఆర్ష ధర్మ పరిరక్షణకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో చేయూతనిస్తాయి.
తెలంగాణతో మీ అనుబంధం..
1998 ప్రాంతంలో శ్రీజయేంద్ర స్వామివారిని తెలంగాణ పర్యటన కోసం అభ్యర్థన చేశాం. వారితో పది రోజులపాటు తెలంగాణలో పర్యటించాం. సిద్దిపేట, జగిత్యాల, బాసర, మంథని, ధర్మపురి తదితర ప్రాంతాలకు వెళ్లాం. శ్రీజయేంద్ర సరస్వతి స్వామివారు ఏదైనా ప్రారంభిస్తే అది మంచి పురోగతి సాధిస్తుంది. అందుకే స్వామివారి చేతుల మీదుగా పలు సంస్థలు ప్రారంభోత్సవాలు చేయించుకునేవి. అలా వారు తెలంగాణలో పర్యటిస్తే ఇక్కడ అంతా మేలు జరుగుతుందని మా ఆశయం. ఆ విశ్వాసంతో వారిని తీసుకొచ్చాం. ఆ సందర్భంగానే ‘తిరుపతిలో కాంతి.. తెలంగాణలో శాంతి’ అని పేర్కొన్నాం. తెలంగాణ ప్రజల్లో భక్తి ప్రపత్తులు ఎక్కువ. ధార్మిక విషయాల్లో, ధర్మాచరణపై ఆసక్తి
కలిగి ఉంటారు.
కంచి పీఠం తరఫున ఎలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?
దేశవ్యాప్తంగా కంచి కామకోటి పీఠం ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. వేద పాఠశాలలు, విద్యాలయాలు, దవాఖానలు ఏర్పాటుచేసి సమాజ హితానికి దశాబ్దాలుగా కృషి చేస్తున్నది. ఇప్పుడు హైదరాబాద్ శంషాబాద్ దగ్గర భారీ కంటి ఆస్పత్రిని నిర్మిస్తున్నాం. కంచి పీఠం ముఖ్య ఉద్దేశం ధర్మప్రచారం. అదే సమయంలో సమాజ సేవ కూడా నిరంతరం కొనసాగిస్తున్నాం. ప్రభుత్వం చాలా రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నది. ఈ ఒరవడి ఇలాగే కొనసాగించాలి. ప్రభుత్వం భౌతిక విషయాలను చూసుకోవాలి. మనుషుల జీవన విధానం, ఆలోచన విధానం, భక్తిశ్రద్ధలు, కుటుంబ విలువలు ఇవన్నీ ధార్మిక సంస్థలు చేయాలి. ప్రభుత్వాలు, ధార్మిక సంస్థలు అవగాహనతో ముందుకుసాగితే ఒకవైపు భౌతిక అభివృద్ధితోపాటు ఆధ్యాత్మిక వికాసం సాధ్యమవుతుంది.
పాదయాత్ర దినోత్సవం
ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు అనేక రూపాలు ధరించి ఈ భూలోకంలో అవతరించాడు. జగద్గురువు ఆదిశంకరాచార్యులు కూడా అలా అవతరించినవారే. ‘శంభోర్మూర్తిః చరతి భువనే శంకరాచార్య రూపః’ కైలాసంలో ఉండే పరమేశ్వరుడే శంకరాచార్యులుగా ప్రభవించారు. పురాణ వాఙ్మయాన్ని, శాస్ర్తాలను, వేదాలను కాపాడటం కోసం, వేద మార్గాన్ని సంరక్షించడం కోసం జగద్గురువుగా అవతరించారు. సనాతన ధర్మ వైశిష్ట్యాన్ని పామరులకు సైతం చేరువ చేశారు. భుక్తిని, ముక్తిని ప్రసాదించడానికి కనకధార స్తోత్రం, సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతం, శివుడి స్తోత్రాలు, సౌందర్యలహరి, వివేక చూడామణి తదితర అనేక స్తోత్రాలను ఉపదేశించారు. ముఖ్యంగా యావద్భారతం పాదయాత్ర చేసి సనాతన ధర్మాన్ని పునః ప్రతిష్ఠించారు. వారి జయంతి అయిన వైశాఖ శుక్ల పంచమిని పాదయాత్ర దినోత్సవంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఫలితంగా ధర్మ ప్రచారం, ఆధ్యాత్మిక భావనలు దేశమంతా పరిఢవిల్లుతాయి.
కామకోటి అంటే..
కామకోటి అంటే శ్రీచక్రం. కంచిలో పుణ్యకోటి, రుద్రకోటి, కామకోటి అని మూడు విమాన గోపురాలు ఉన్నాయి. అందులో అమ్మవారి గోపురం కామకోటి. కామకోటి అంటే.. ‘దీని తర్వాత మరొక ఆశ లేదు’ అని. అన్నిటికన్నా గొప్పది జ్ఞానం. ప్రతి మనిషి లక్ష్యం జ్ఞానం. అన్నప్రాప్తి నుంచి జ్ఞానప్రాప్తి వరకు ఆశీర్వదించే పీఠం కామకోటి. దీని తర్వాత ఇక కామం (కోరిక) అనేది ఉండదు.
గుడి కేంద్రంగా..
దేవాలయాలను ధర్మ కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. ‘హర్ పంచాయత్ మే పండిత్ హోనా, హర్ మందిర్ తిరుపతి హోనా’ నినాదాన్ని ఒక విధానంగా అమలుచేయాలి. ప్రతి పల్లెలో ధర్మ ప్రబోధకుడిని తయారు చేసుకోవాలి. భారతీయ విచార ధారను ప్రజలకు తెలియపరచాలి. ఆలయాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలి.
కారుణ్యమూర్తి పరమాచార్య
ఒకసారి మహాస్వామివారు మహబూబ్నగర్ పట్టణానికి వచ్చారు. వారి దర్శనం చేసుకోమని శ్రీజయేంద్ర సరస్వతి స్వామివారు నన్ను అక్కడికి పంపించారు. అక్కడ అంకోల వృక్షం దగ్గర ఉన్నారు మహాస్వామి. నేను దర్శనానికి వెళ్లాను. అప్పుడు లీలావతి గణితం గురించి మాట్లాడారు స్వామివారు. ‘వర్గమూలం తెలుసా?’ అని అడిగారు. వారు అడిగిన వాటికి సమాధానం చెప్పాను. ఆ ప్రశ్న ద్వారా మన మూలాలను కాపాడాలని అంతర్లీనంగా ప్రబోధించారు. తర్వాత కర్ణాటకలో గుల్బర్గాలో స్వామివారు ఉన్నారని వారి దర్శనానికి వెళ్లాను. అప్పుడు భగవంతుడికి దీపారాధన చేసే మంత్రం గురించి అడిగారు. ఎందరో ఉండగా ఆ మంత్రం గురించి నన్ను అడగటం ఆయన భవిష్యత్ దర్శనానికి నిదర్శనం. నిండైన కారుణ్యమూర్తి వారు. స్వామివారి మేధ అపారం. ఒక్కసారి మనిషితో మాట్లాడితే.. యాభై ఏండ్లయినా ఆ వ్యక్తి మళ్లీ కలిస్తే, అతని పేరు, వారి తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పేవారు. స్వామివారి విషయంలో స్మృతి తప్ప విస్మృతి లేదు.
ప్రేమమూర్తి
శ్రీజయేంద్ర సరస్వతి మహాస్వామివారు మాపై అవ్యాజమైన వాత్సల్యం కురిపించేవారు. ఒకసారి స్వామివారితో ఉత్తరాఖండ్ యాత్రకు వెళ్లాం. హరిద్వార్కు వెళ్లాక ఆయన అక్కడే ఉండిపోయారు. మఠ నిర్వహణ, త్రికాలాల్లో చంద్రమౌళీశ్వర ఆరాధన చూసుకుంటూ, మమ్మల్ని ఉత్తరకాశీ, కేదార్నాథ్, గంగోత్రి దర్శనానికి పంపారు. పీఠం బాధ్యతలు చూస్తూ ఆ ప్రాంతాలు సందర్శించడం కష్టమే! వారికి మాపై ఉన్న ప్రత్యేకమైన దయాభిమానాలతో ఎన్నో విషయాల్లో శ్రమ కలిగినప్పటికీ సర్దుకుపోయేవారు. గతంలో హైదరాబాద్కు వచ్చినప్పుడు కూడా పూజా కార్యక్రమాలు వారు చేస్తూ, మమ్మల్ని యాదగిరిగుట్ట క్షేత్ర దర్శనానికి పంపారు.
… కణ్వస, ఫొటోలు : వి. రజినీకాంత్ గౌడ్
సనాతన ధర్మాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులు నలుదిక్కులా ఎలా విస్తరింపజేశారు?”
ఆది శంకరాచార్యులు సన్యాసం స్వీకరించేందుకు తల్లిని ఎలా ఒప్పించాడో తెలుసా?”