గువాహటి: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రచారం జోరును పెంచింది. ముఖ్యంగా బీజేపీకి పట్టున్న అసోం, బెంగాల్ రాష్ట్రాల్లో స్థానిక బీజేపీ నేతలతోపాటు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇవాళ అసోంలో రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన .. బీజేపీ ఇప్పటికే త్రిపురలో అధికారంలో ఉన్నదని, ఈ ఎన్నికల్లో అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కూడా అధికారంలోకి రాబోతున్నదని చెప్పారు.
త్రిపుర, అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు బంగ్లాదేశ్తో సరిహద్దులు కలిగిఉన్నాయని, ఇప్పటికే త్రిపురలో అధికారంలో ఉన్న బీజేపీ అసోం, పశ్చిమబెంగాల్లోనూ ప్రభుత్వాలను ఏర్పాటుచేసిన తర్వాత దేశంలోకి బంగ్లాదేశీయుల అక్రమ చొరబాట్లను అడ్డుకోవడం కోసం ఆ దేశంతో ప్రధాన సరిహద్దు ప్రాంతాన్ని మూసివేస్తామని రాజ్నాథ్ చెప్పారు. కాబట్టి ప్రజలు బీజేపీకి ఓటేసి గెలిపించాలని ఆయన కోరారు.