వాషింగ్టన్, నవంబర్ 5: ప్రపంచంలోని ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అధిక బరువు (ఊబకాయం). ఈ సమస్యను కట్టడి చేయడానికి పలు ఔషధాలు మార్కెట్లో లభిస్తున్నప్పటికీ, అధికారికంగా వాటికి అనుమతులు లేవు. దీంతో దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి. అయితే, డెన్మార్క్కు చెందిన ఫార్మా కంపెనీ నోవో నోర్డిక్ ఏఎస్.. ‘వీగోవీ’ పేరిట స్థూలకాయాన్ని నియంత్రించే ఓ ఔషధాన్ని తీసుకొచ్చింది. అమెరికాలో ఊబకాయానికి అనుమతులు పొందిన తొలి ఔషధం ఇదేనని సమాచారం. జూన్లో అనుమతులు పొందిన ఈ ఔషధం ఇటీవలే అగ్రరాజ్యంలోని ప్రధాన స్టోర్లలో అందుబాటులోకి వచ్చింది. ఇంకేముంది.. ఇప్పటికే ఊబకాయం సమస్యతో సతమతమవుతున్న అమెరికన్లు.. స్టాకు వచ్చీరాగానే, కొనుగోళ్లకు పోటెత్తారు. దీంతో గంటల వ్యవధిలోనే స్టాక్ అంతా ఖాళీ అవుతున్నది. ఊబకాయులకు కరోనా వైరస్ సోకే ప్రమాదం ఎక్కువన్న అధ్యయనాల హెచ్చరికలతో కొనుగోళ్లు మరింతగా పెరుగుతున్నాయి. కాగా, 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా ఊబకాయంతో బాధపడొచ్చని నివేదికల సారాంశం.
ఆకలిని నియంత్రించే మెదడులోని జీఎల్పీ-1 హార్మోనును ‘వీగోవీ’ నియంత్రిస్తుంది. తద్వారా ఔషధాన్ని తీసుకునే వారు తక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకుంటారు. ఈ ఔషధం సాయంతో 15 శాతం బరువు తగ్గే అవకాశమున్నట్టు సమాచారం.
ఔషధం పేరు: వీగోవీ
ఉపయోగం: బరువు తగ్గేందుకు
ఎలా తీసుకోవాలి?: ఇంజెక్షన్ రూపంలో వారానికి ఒక డోసు
ధర: నాలుగు డోసులకు రూ. 9 వేలు (అంచనా)
ఊబకాయం సమస్య దేశ ఆర్థిక వ్యవస్థలపై గణనీయమైన ప్రభావం చూపుతున్నట్టు వరల్డ్ ఒబెసిటీ అండ్ రిసెర్చ్ ట్రయాంగిల్ ఇన్స్టిట్యూట్ (ఆర్టీఐ ఇంటర్నేషనల్) తాజా నివేదికలో వెల్లడించింది. 2019కి సంబంధించి ఎనిమిది దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దీని ప్రభావం 0.8 శాతం నుంచి 2.4 శాతం వరకు ఉన్నట్టు పేర్కొంది. భారత్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, మెక్సికో, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, స్పెయిన్, థాయిలాండ్లో ఈ అధ్యయనం జరిపారు. స్థూలకాయం వల్ల వర్క్ఫోర్స్ వృద్ధిపై ప్రభావం పడటంతో భారత జీడీపీ 0.8 శాతం క్షీణతను నమోదుచేసినట్టు వెల్లడించింది.