ముంబై, ఫిబ్రవరి 22: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఐపీవో పట్ల మార్కెట్లో అమితంగా ఆసక్తి ఉందని, ప్రభుత్వం ఈ పబ్లిక్ ఆఫర్ను జారీచేయాలనే చూస్తున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో మంత్రి పై ప్రకటన చేశారు. అయితే ఇష్యూ జారీకి మార్కెట్ పరిస్థితి అనుకూలంగా ఉంటుందా అనే ఆందోళన సైతం తమకు ఉందన్నారు. రెండ్రోజుల ముంబై పర్యటనలో పారిశ్రామిక, వ్యాపారవేత్తలు, బ్యాంకర్లతో భేటీ జరిపిన తర్వాత మీడియాతో ఆర్థిక మంత్రి మాట్లాడుతూ ముసాయిదా ప్రాస్పెక్టస్ను విడుదల చేసిన అనంతరం ఎల్ఐసీ ఐపీవో పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరిగిందని తెలిపారు.
పరిస్థితి ఎదురైతే పెట్రో సుంకాలు తగ్గిస్తాం
రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న బ్రెంట్ క్రూడ్ ధరలను తాము గమనిస్తూ ఉన్నామని సీతారామన్ చెప్పారు. క్రూడ్ పెరుగుతున్నందున, ప్రభుత్వం పెట్రో, డీజిల్ సుంకాల్ని తగ్గిస్తుందా అంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ ఇది (పన్నుల్లో కోత) ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశమేనని, అటువంటి పరిస్థితి ఏర్పడితే ఎక్సయిజు సుంకాల తగ్గింపుపై తాము నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
ఎన్ఎస్ఈలో నిర్వహణా లోపాలపై దృష్టిపెట్టాం
ఎన్ఎస్ఈలో కార్పొరేట్ గవర్నెన్స్, నిర్వహణా లోపాలపై తాము దృష్టిపెట్టామని ఆర్థిక మంత్రి అన్నారు. ఇటీవల సెబీ జారీచేసిన ఉత్తర్వుల్ని ప్రస్తావించగా, ఈ కేసులో నియంత్రణాపరమైన చర్యలు సరిగ్గా ఉన్నాయా లేదా అనే అంశంపై వ్యాఖ్యానించబోనన్నారు. ఇందుకు సంబంధించి తనకు చేరిన సమాచారాన్ని పరిశీలిస్తున్నాని చెప్పారు. మన వ్యాపారంపై రష్యా-ఉక్రెయిన్ ప్రభావం ఇంకా పడలేదన్నారు.
చైనా యాప్ల నిషేధంతో..
చైనా మొబైల్ యాప్ల్ని నిషేధించడం వల్ల ఇరు దేశాల వాణిజ్యంపై ప్రభావం పడలేదని సీతారామన్ తెలిపారు. ఈ యాప్ల నిషేధంపై నిర్ణయం ద్వైపాక్షిక వాణిజ్యానికి ముడిపెట్టింది కాదని, కొన్ని కోణాల్లో అవి హానికరమని భావించినందునే తాము యాప్ల్ని నిషేధించామని, అది వ్యాపారంపై ప్రభావం చూపలేదన్నారు.