ముంబై, ఫిబ్రవరి 9: స్థిరాస్తి, షేర్లు, బాండ్లపై ప్రస్తుతం అమలవుతున్న క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ను సరళీకరించనున్నట్టు కేంద్ర రెవిన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వెల్లడించారు. ఈ మూడు రకాల ఆస్తులపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ను లెక్కించేటపుడు వివిధ కాలపరిమితుల్ని, వేరువేరు పన్ను రేట్లను పరిగణనలోకి తీసుకోవాల్సివస్తున్నదని, ఈ విధానాన్ని సరళతరం చేస్తామన్నారు. ఆదాయపు పన్ను చట్టం కింద స్థిర, చరాస్తుల విక్రయం ద్వారా వచ్చిన లాభాలపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. చరాస్తుల్లో కార్లు, ఫర్నిచర్ వంటి వ్యక్తిగత వినియోగ ఆస్తుల విక్రయంపై మాత్రం ఈ పన్ను ఉండదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ద్వారా కేంద్రానికి సమకూరే ఆదాయం పదింతలు పెరిగి రూ. 80,000 కోట్లకు చేరుతుందని అంచనా. బుధవారం సీఐఐ సదస్సులో బజాజ్ మాట్లాడుతూ భారత్ వంటి ఇతర దేశాల్లోనూ, ధనిక దేశాల్లోనూ అమలవుతున్న క్యాపిటల్ గెయిన్స్ పన్ను రేట్లను తమ శాఖ ఇప్పటికే అధ్యయనం చేసిందని, ఇక్కడ ఆ విధానం మరీ సంక్లిష్టంగా ఉందని తాను భావిస్తున్నాన్నారు. తగిన సమయం వచ్చినపుడు దీనిని సరళీకరిస్తామన్నారు.
క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ను విధించడానికి రియల్ ఎస్టేట్కు 24 నెలలు, షేర్లకు 12 నెలలు, బాండ్లు/రుణపత్రాలకు 36 నెలల కాలపరిమితి ప్రస్తుతం అమలవుతోందని, వీటిలో మార్పు చేయాల్సి ఉంటుందన్నారు. అలా మార్పు చేసినపుడు కొంతమంది పన్ను చెల్లింపుదారులు లాభపడవచ్చని, మరికొంతమంది నష్టపోవచ్చని, ఇది కొంత కష్టమైన వ్యవహారమని బజాజ్ వివరించారు. పైన ప్రస్తావించిన కాలపరిమితుల లోపుగా ఆయా ఆస్తుల్ని అమ్మితే స్వల్పకాలిక మూలధన లాభాల పన్నును, పరిమితి తర్వాత విక్రయిస్తే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును చెల్లించాలి. చట్టం ప్రకారం ఈ రెండింటికీ వేరువేరు పన్ను రేట్లు ఉన్నాయి. ఈక్విటీ షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్ యూనిట్లను 12 నెలలుపైగా, రియల్ ఎస్టేట్ ఆస్తిని 24 నెలలకు మించి ఉంచుకుంటే, దానిని దీర్ఘకాలిక మూలధన ఆస్తిగా పరిగణిస్తారు. ఆ పరిమితిలోపు విక్రయించే ఆస్తులపై వచ్చే లాభాలకు పన్ను చెల్లింపుదారు శ్లాబ్కు అనుగుణమైన పన్ను రేటు ఉంటుంది. ఈక్విటీ షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై మాత్రం స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను 15 శాతం విధిస్తారు. ఏ ఆస్తి అయినా, రూ. 1 లక్ష మించి లాభం వచ్చే దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్పై పన్ను 10 శాతం ఉంటుంది. లాంగ్ టెర్మ్, షార్ట్ టెర్మ్ రేట్లు తక్కువగా 10, 15 శాతమే ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ పన్నుతో ప్రభుత్వానికి రూ. 60,000-80,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామని బజాజ్ అన్నారు. గతేడాది ఇది రూ.8,000 కోట్లేనన్నారు.